. . . రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిజామాబాద్ ప్రీమియర్ లీగ్ క్రీడా పోటీలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, బాస్కెట్బాల్, యోగా వంటి విభిన్న క్రీడల్లో ఏప్రిల్ 20 నుండి 28 వరకు జరగనున్న ఈ పోటీలకు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడా జ్యోతిని అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ, మేయర్ ఉమారాణి, సిపి సాయి చైతన్యతో కలిసి షబ్బీర్ ఆలీ వెలిగించి పోటీలను ప్రారంభించారు.

ముందుగా క్రీడాకారుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం జరిగిన సభలో షబ్బీర్ ఆలీ ప్రసంగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం క్రీడల అభివృద్ధికి విశేష ప్రాధాన్యత ఇస్తుందన్నారు. గ్రామీణ స్థాయి నుండి అంతర్జాతీయ స్థాయి వరకు ప్రతిభావంతులైన క్రీడాకారులను తీర్చిదిద్దేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు.

ప్రత్యేకంగా యువతలో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఇలాంటి లీగ్ పోటీలు ఎంతో ఉపయోగకరమని ఆయన అభిప్రాయపడ్డారు. క్రీడలు కేవలం శారీరక దృఢత్వానికే కాకుండా క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి క్రీడల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించి, అంతర్జాతీయ ప్రమాణాలతో స్పోర్ట్స్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నారని షబ్బీర్ అలీ వివరించారు. ఈ యూనివర్సిటీ ద్వారా రాష్ట్రంలోని క్రీడాకారులకు శాస్త్రీయ శిక్షణ, ఆధునిక సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు. అలాగే ప్రతి జిల్లాలో క్రీడా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ, స్టేడియాలు, కోచింగ్ సెంటర్లు, జిమ్నేషియంలను అభివృద్ధి చేస్తోందని చెప్పారు.

ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు ఆర్థిక ప్రోత్సాహకాలు, ఉద్యోగావకాశాలు కల్పించడం ద్వారా వారి భవిష్యత్తును భద్రపరచేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ డాక్టర్ కవిత, తెయూ పాలక మండలి సభ్యులు రజనీకాంత్, సెక్యూరిటీ కౌన్సిల్ సభ్యులు రజనీకాంత్, స్థానిక ప్రజాప్రతినిధులు, క్రీడా సంఘాల ప్రతినిధులు, యువకులు, క్రీడాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పోటీలను విజయవంతంగా నిర్వహించాలని నిర్వాహకులను అభినందిస్తూ, క్రీడాకారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
. . . ప్రభుత్వం స్టేడియం నిర్మాణానికి కృషి చేయాలి : ఎమ్మెల్యే ధన్ పాల్

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజామాబాద్ లో సింథటిక్ ట్రాక్ తో కూడిన స్టేడియం నిర్మాణాన్ని చేపట్టాలన్నారు. గత సంవత్సరమే హామీ ఇచ్చినా ..ఇప్పటివరకు నిర్మాణం ప్రారంభం కాలేదన్నారు. స్టేడియం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా అందేలా తమ వంతు కృషి చేస్తామని స్పష్టం చేశారు. శిక్షకులు లేకున్నా, పూర్తి సౌకర్యాలతో స్టేడియం లేకున్నా అనేక క్రీడాంశాల్లో జిల్లా క్రీడాకారులు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, మేయర్ ఉమారాణి, నిజామాబాద్ సెక్యూరిటీ కౌన్సిల్ చైర్మన్, పోలీస్ కమిషనర్ సాయి చైతన్య, అడిషనల్ డిసిపి శుభం ప్రకాష్, కౌన్సిల్ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కవిత రెడ్డి, సంయుక్త కార్యదర్శలు రజనీకాంత్, శ్రీనివాస్ రెడ్డి, డాక్టర్ ఉష తదితరులు పాల్గొన్నారు.

