నిజామాబాద్ సిటీ, బతుకమ్మ :
జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు, విద్యావంతులు, ప్రజలు అందరూ జన గణన స్వీయ నమోదు చేసుకోవాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. జన గణన స్వీయ నమోదు కోసం ఈ నెల 26వ తేదీ నుండి మే 10వ తేదీ వరకు పోర్టల్ అందుబాటులో ఉంటుందన్నారు. https://se.census.gov.in పోర్టల్ ద్వారా ఎవరికి వారు జన గణన స్వీయ నమోదు చేసుకోవచ్చని తెలిపారు. భారత ప్రభుత్వం జన గణన – 2027 ప్రక్రియను రెండు దశలలో చేపడుతోందని అన్నారు. మొదటి దశలో మే 11 నుండి జూన్ 9 వరకు ఇండ్ల గణన చేస్తారని కలెక్టర్ వివరించారు. రెండవ దశలో 2027 ఫిబ్రవరి 9 నుండి 28 వరకు జనాభా గణన, కుల గణన ఉంటుందన్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 26 నుండి స్వీయ గణన ప్రారంభం అవుతుందని అన్నారు. ప్రతి ఒక్కరు స్వీయ గణనలో పాల్గొనాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి కోరారు. ఇండ్ల గణన కోసం మే 11 నుండి జూన్ 9 వరకు మీ ఇంటి వద్దకు వచ్చే నమోదు అధికారికి అన్ని వివరాలు తెలియజేయాలని సూచించారు. జన గణన వివరాలు గోప్యంగా ఉంచబడతాయని కలెక్టర్ తెలిపారు. ప్రజలందరూ తప్పనిసరిగా స్వీయ నమోదు చేసుకుని, ఇండ్ల గణనకు వచ్చే అధికారికి సరైన సమాచారాన్ని ఇచ్చి దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ కోరారు.
