ఎల్లారెడ్డి, బతుకమ్మ :
ఎల్లారెడ్డి మండలం ఆడివిలింగాల గ్రామానికి చెందిన రైతు లింగాల రాములు (59) వడదెబ్బకు గురై మృతి చెందిన విషాద ఘటన శుక్రవారం చోటు చేసుకుంది. ఈ విషయాన్ని స్థానిక ఎస్ఐ మహేష్ తెలిపారు. ఎస్ఐ తెలిపిన వివరాల ప్రకారం, రాములు ఉదయం తన పొలంలో పనులు ముగించుకుని సాయంత్రం సుమారు 4 గంటలకు ఇంటికి చేరుకున్నారు. అనంతరం మరో పొలానికి నీళ్లు పారబెట్టేందుకు వెళ్లి, రాత్రి వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. తదుపరి ఆయన కుమారులు పొలానికి వెళ్లి వెతికినప్పుడు, రాములు పొలం గట్టు పై అపస్మారక స్థితిలో పడి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఎల్లారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడి వైద్యులు పరిశీలించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుమారుడు బాగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు ఎస్ఐ మహేష్ వెల్లడించారు.
