. . . పోలీస్ కమిషనర్ సాయిచైతన్య
. . . . ప్రతి ఒక్కరూ సిపిఆర్ పద్ధతి అవగాహన కలిగి ఉండాలి
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
రాష్ట్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజాపాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు ప్రమాదాలు నియంత్రించడం ప్రజలలో ట్రాఫిక్ నియమాలు పట్ల బాధ్యత భావం పెంపొందించడం లక్ష్యంగా అరైవ్ ఆలైవ్ కార్యక్రమాన్ని ఏప్రిల్ 13 నుండి 18 వరకు జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తున్నారు . ఇందులో భాగముగా శుక్రవారం ఐదవ రోజు నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్ యందు బ్లూ కోర్టు సిబ్బందికి, ఆటో డ్రైవర్లకు సిపిఆర్ పద్ధతి పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా ప్రాణరక్షణకు సంబంధించిన అత్యవసర నైపుణ్యాలపై అవగాహన కల్పించడం అత్యంత అవసరమని సీపీ పేర్కొన్నారు. ముఖ్యంగా పోలీసు సిబ్బంది,ఆటో డ్రైవర్లు వంటి ప్రజలతో నిత్యం సంబంధం కలిగిన వర్గాలు తప్పనిసరిగా సీపీఆర్ విధానం గురించి పూర్తి స్థాయిలో అవగాహన కలిగి ఉండాలని ఆయన సూచించారు. ప్రస్తుతం గుండెపోటు, రోడ్డు ప్రమాదాలు వంటి అత్యవసర పరిస్థితుల్లో బాధితులకు తక్షణ సహాయం అందించడంలో సిపిఆర్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. అయితే సమాజంలో ఇంకా చాలామందికి ఈ పద్ధతి పై సరైన అవగాహన లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీపీ వెల్లడించారు. ఈ శిక్షణలో సిపిఆర్ విధానం, ప్రాథమిక ప్రథమ చికిత్స, అత్యవసర పరిస్థితుల్లో ఎలా స్పందించాలి వంటి అంశాలను నిపుణుల ద్వారా వివరించనున్నారు. ప్రతి పోలీసు సిబ్బంది, ఆటో డ్రైవర్లు మాత్రమే కాకుండా సాధారణ ప్రజలు కూడా ఈ శిక్షణలో పాల్గొని అవగాహన పెంచుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. సమయానికి సరైన సహాయం అందిస్తే అనేక ప్రాణాలను కాపాడవచ్చని, అందుకు సిపిఆర్ వంటి నైపుణ్యాలు ప్రతి ఒక్కరికీ అవసరమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా సమాజంలో భద్రతా చైతన్యం పెంపొందించి, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ స్పందన సామర్థ్యాన్ని పెంచడమే ప్రధాన లక్ష్యమని పోలీస్ కమిషనర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అదనపు డీ.సీ.పీ (అడ్మిన్) బస్వా రెడ్డి, నిజామాబాద్ ట్రాఫిక్ ఏ.సీ.పి మస్తాన్ అలీ, జిల్లా స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలం, ట్రాఫిక్ సి ఐ శ్రీ ప్రసాద్, ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ వినోద్, ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ విశాల్, డాక్టర్ రామనేశ్వర్ (న్యూరాలజిస్ట్) (ఐ.ఎమ్.ఏ ట్రెజరీ), డా. శ్రీశైలం (పీడియాట్రెస్ట్) , డాక్టర్ విట్టల్ ఆనస్తేషియా స్పెషలిస్ట్, ఐటీ కోర్స్ సిబ్బంది, బ్లూ కోర్ట్ సిబ్బంది , ఆటో డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

