. . . సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
దేశంలో వివిధ మతాలు, కులాల ప్రజలను ఐక్యంగా ఉంచి లౌకిక ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించటం కొరకు, అన్ని వర్గాల ప్రజలకు సమాన హక్కులు కల్పించే ఆలోచనతో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని అందించారని సీపీఎం జిల్లా కార్యదర్శి రమేష్ బాబు అన్నారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా స్థానిక పులాంగ్ చౌరస్తాలోని అంబేద్కర్ విగ్రహానికి సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత రాజ్యాంగం స్థానంలో మనువాద సిద్ధాంతాన్ని అమలు జరపటానికి బిజెపి ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని అన్నారు. అందువల్ల భారత రాజ్యాంగ పరిరక్షణ కొరకు అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా పోరాడాల్సిన అవసరం ఆసన్నమైందని తెలిపారు. దేశంలో మతోన్మాద శక్తుల ప్రభావం రోజురోజుకు బలపడుతున్న తరుణంలో వాటిని ఎదిరించి ప్రజలను కుల మత భావజాలానికి వ్యతిరేకంగా ప్రజలందరూ ఐక్యంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పెద్ద వెంకటరాములు, జిల్లా కమిటీ సభ్యులు సుజాత, జంగం గంగాధర్, విగ్నేష్, నగర నాయకులు నల్వాల నరసయ్య, అంజయ్య, శంషాద్దీన్, రాజు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

