. . . నిజామాబాద్ పోలీస్ కమీషనర్ పి.సాయి చైతన్య
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు రోడ్డు భద్రతా వ్యవస్థలను బలోపేతం చేయడం, ప్రజల్లో డిఫెన్సివ్ డ్రైవింగ్ సంస్కృతిని పెంపొందించడమే అరైవ్ అలైవ్ ప్రధాన లక్ష్యమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా రోడ్డు ప్రమాదాలను నియంత్రించడం, ప్రజల్లో ట్రాఫిక్ నియమాల పట్ల బాధ్యతాభావం పెంపొందించడం లక్ష్యంగా “అరైవ్ అలైవ్ ” కార్యక్రమాన్ని ఏప్రిల్ 13 నుండి 18 వరకు జిల్లావ్యాప్తంగా విస్తృతంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా సోమవారం నిజామాబాద్ టౌన్ 6 పోలీస్ స్టేషన్ పరిధిలోనీ శాస్త్రి నగర్ లో ఏర్పాటు చేసిన గ్రామ సభ కార్యక్రమం లో సీపీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత కాలంలో ఇతర ప్రమాదాల కంటే రోడ్డు ప్రమాదాల వల్లనే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణాలు అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగం, ట్రాఫిక్ నియమాలను పాటించకపోవడం వంటి అంశాలేనని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా వాహనం నడిపి, తమతో పాటు ఇతరుల ప్రాణాలను కాపాడాలని పిలుపునిచ్చారు.

చిన్న నిర్లక్ష్యాలే పెద్ద ప్రమాదాలకు దారితీస్తాయని, అలాంటి సంఘటనలు కుటుంబాలకు తీరని నష్టాన్ని కలిగిస్తాయని తెలియజేసారు. అనంతరం ట్రాఫిక్ నిబంధనలు తెలియజేసేటటువంటి పాంప్లెంట్లు, పోస్టర్లను విడుదల చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణ కోసం ప్రతిజ్ఞ నిర్వహించారు.

అనంతరం గ్రామ పంచాయతీ కార్యాలయం సమీపంలో చెట్లు నాటారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఇన్ చార్జి ఏసిపి రాజా వెంకటరెడ్డి, ట్రాఫిక్ ఏసిపి మస్తాన్ అలీ, సౌత్ రూరల్ సురేష్ కుమార్, ట్రాఫిక్ సిఐ ప్రసాద్, ట్రాఫిక్ రిజర్వ్ ఇన్స్ పెక్టర్ వినోద్, టౌన్ 6 ఎస్ఐ వెంకట్ రావ్, జిల్లా మోటార్ వెహికల్ ఇన్స్ పెక్టర్ బి.కిరణ్ కుమార్, ఎస్ ఐ డి.శ్రీకాంత్, గ్రామ సర్పంచ్ నరాల జ్యోతి, డివిజనల్ పంచాయతీరాజ్ ఆఫీసర్ శ్రీనివాస్, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
