నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆద్వర్యంలో నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ కార్యాలయం వద్ద మజ్జిగ పంపిణీ చేశారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ మేయర్ కె.ఉమారాణి గురువారం మజ్జిగ పంపిణీని లాంచనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ ఎండలు మండిపోతున్న క్రమంలో లయన్స్ క్లబ్ ఆఫ్ ఇందూర్ ఆద్వర్యంలో మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. ఎండాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని స్వచ్చంద సంస్థలు మంచినీరు, మజ్జిగ, అంబలి పంపిణీకి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఎండల దృష్ట్యా ప్రజలు ముందు జాగ్రత్తలు తీసుకోవాలని అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు అబ్బాయి లింబాద్రి, పి.రాఘవేందర్, పూర్వాద్యక్షులు డి.యాదగిరి, పి.లక్ష్మినారాయణ, బి.గురుప్రసాద్, కరిపె రవీందర్, పుల్గం హన్మాండ్లు, రమేష్, చింతల గంగాదాస్, రీజియన్ చైర్మెన్ ఉదయ సూర్యభగవాన్, జోన్ చైర్మెన్ భూమన్న, ఉపాద్యక్షులు రవీంద్రనాథ్ గుప్త, ప్రోగ్రామ్ చైర్మెన్ జైపాల్ కాలె తదితరులు పాల్గొన్నారు.
