బోధన్, బతుకమ్మ :
బోధన్ పట్టణంలోని 14వ వార్డు గంజ్ రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న స్వయంభు రామ లక్ష్మణ మందిరంలో శనివారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు దొంగతనానికి పాల్పడ్డారు. ఆలయంలో ఉన్న సీతమ్మవారి వెండి పుస్తెలు మెట్టలను, హుండీని పగలగొట్టి అందులోని నగదును ఎత్తుకెళ్లినట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ఘటనపై బీజేపీ పట్టణ అధ్యక్షుడు పసుపులేటి గోపి కిషన్ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు బోధన్ పట్టణ సీఐకి రాతపూర్వక ఫిర్యాదు చేశారు. దొంగలను వెంటనే గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను కోరారు. అలాగే రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతం, ఆలయ పరిధిలో తరచుగా పోలీస్ పెట్రోలింగ్ నిర్వహించాలని కోరారు. భవిష్యత్తులో హిందూ దేవాలయాలపై ఇలాంటి దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు కిరణ్, అంజి, కృష్ణ, కన్నుగౌడ్, విగ్నేష్, తిలక్, తేజ, హరి, శంకర్, శ్రీనివాస్, సాయి, శేఖర్, రాజన్న, రమేష్ తదితరులు పాల్గొన్నారు.
