నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
నిజామాబాద్ నగరంలోని మూడవ కల్లు డిపో భవాని కల్లుగీత పారిశ్రామిక సహకార సంఘం లో కోట్ల రూపాయల నిధులు దుర్వినియోగం జరిగిందని ఈ నిధులను ఓ కుటుంబం కాజేసిందని గీతా కార్మికులు, గౌడ కులస్తులు ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గీతా కార్మికులు మాట్లాడుతూ 2017 సంవత్సరంలో అప్పటి ప్రభుత్వం స్థానికంగా ఉన్నటువంటి రెండు సొసైటీలు రద్దు కావడంతో మూడో సొసైటీని మంజూరు చేయడం జరిగిందని, సొసైటీ ఏర్పాటు ముఖ్య ఉద్దేశం ఈ సొసైటీ పై ఆధారపడి బతుకుతున్నటువంటి 200 గౌడ కుటుంబాలకు జీవనాధారంగా ఉంటుందని భావిస్తూ మంజూరు చేయడం జరిగిందన్నారు. కానీ తమ సొంత జాగిర్లా భావిస్తూ 55 మంది సొసైటీ సభ్యులలో ఓ కుటుంబం కల్లు వ్యాపారం లో అనేక అక్రమాలకు పాల్పడుతూ కోట్ల రూపాయల నిధులను కాజేసారన్నారు. అక్రమాలపై ప్రశ్నిస్తున్న కార్మికులను సొసైటీ నుండి తొలగించడం జరుగుతోందని, రాజకీయ పలుకుబడితో పేద కార్మికుల భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. సొసైటీ బైలా ప్రకారం స్థానికంగా లేనటువంటి ఇతర జిల్లాలకు చెందిన ఇతర గ్రామాలకు చెందిన వ్యక్తులు ఈ సొసైటీలోలు సభ్యులుగా కొనసాగుతున్నారని, వారిని తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి ప్రజావాణిలో సొసైటీ సభ్యులు అందజేసిన ఫిర్యాదు మేరకు ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ కమిటీని వేయడం జరిగిందని, ఆ కమిటీ సమగ్రంగా విచారిస్తుందని, కొద్ది రోజుల్లోనే అన్ని విషయాలు బయటకు తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గీతా కార్మికులు రాజా గౌడ్, యాద గౌడ్, మల్ల గౌడ్, రామా గౌడ్, శంకర్ గౌడ్, కాటమయ్య గౌడ్, కొండ గౌడ్, సూరిబాబు గౌడ్, రాజు గౌడ్, గౌడ సంఘం సభ్యులు సిరియాల స్వామి గౌడ్, బిక్షపతి గౌడ్, సురేష్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, నవీన్ గౌడ్, ప్రేమ్ చంద్ గౌడ్, అశోక్, రాజ్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

