. . . సంతృప్తి వ్యక్తం చేసిన డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలి కమ్యూనికేషన్ కేంద్ర జాయింట్ సెక్రటరీ దేవేంద్ర కుమార్ రాయ్
నిజామాబాద్ అర్బన్, బతుకమ్మ :
కేంద్ర ప్రభుత్వం ద్వారా చేపడుతున్న పీఎం శ్రీ పథకం అమలు సౌకర్యాలపై పరిశీలన నిమిత్తం కేంద్ర జాయింట్ సెక్రెటరీ దేవేంద్ర నిజామాబాద్ కేంద్రీయ విద్యాలయంను సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో అమలు చేస్తున్న స్మార్ట్ క్లాస్రూంలు, డిజిటల్ ల్యాబ్లు, సైన్స్, కంప్యూటర్ ల్యాబ్ సదుపాయాలు, శుద్ధి చేసిన తాగునీరు, పరిశుభ్రమైన శౌచాలయాలు, క్రీడా వసతులు వంటి మౌలిక సదుపాయాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థుల గణిత, విజ్ఞాన ప్రదర్శనలను ఆసక్తిగా తిలకించారు. అలాగే పాఠశాల ప్రాంగణంలో చేపడుతున్న మొక్కల నాటడం కార్యక్రమం, పర్యావరణ పరిరక్షణ చర్యలు, విద్యార్థులు స్వయంగా చేపడుతున్న సేంద్రియ వ్యవసాయ కార్యక్రమాలు ఆయనను ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ప్రకృతి పట్ల చూపుతున్న ఆసక్తి, సేంద్రియ వ్యవసాయం ద్వారా పర్యావరణ అవగాహన పెంపొందించడంపై ఆయన సంతోషం వ్యక్తం చేశారు.

పాఠశాల ప్రిన్సిపాల్ వెంకటేశ్వరరావు పీఎంశ్రీ పథకం ద్వారా చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. పాఠశాల నిర్వహణ, బోధనా విధానాలు, విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలపై జాయింట్ సెక్రెటరీ సంతృప్తి వ్యక్తం చేస్తూ పీఎం శ్రీ పథకం లక్ష్యాలను సక్రమంగా అమలు చేస్తున్నందుకు అభినందనలు తెలిపారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి ఈ పథకం మరింత తోడ్పడాలని ఆకాంక్షించారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు. ఈ కార్యక్రమంలో జాయింట్ సెక్రెటరీ వెంట రాష్ట్ర విద్యాశాఖ అధికారులు విజయలక్ష్మి బాయి, శ్రీనాథ్, జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, అధ్యాపకులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

