. . . రూ.2.40 లక్షల విలువైన సెల్ఫోన్లు స్వాధీనం
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
రైలులో ప్రయాణికుల నుంచి చోరీ చేసిన మొబైల్ ఫోన్ల కేసులో ఇద్దరు వ్యక్తులను పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. నిజామాబాద్ రైల్వే ప్లాట్ఫారంపై తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐఆర్ పీ హెచ్.సాయిరెడ్డి తెలిపారు. ఆయన వివరాల ప్రకారం, సిబ్బందితో పాటు ఆర్ పీఎఫ్ ఇన్స్పెక్టర్ కల్పనా ఆధ్వర్యంలో ప్లాట్ఫారంపై తనిఖీలు నిర్వహిస్తుండగా ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. విచారణలో వారు తమ పేర్లు సయ్యద్ మజీద్ అలీ (22), మిర్జా అక్తర్ బేగ్ (19) అని వెల్లడించారు. వారి వద్ద నుంచి ఐఫోన్ 17 ప్రో, శాంసంగ్ ఎం 21 (రెండు ఫోన్లు), వివో టి 40 మొబైల్ ఫోన్తో పాటు ఆపిల్ ఇయర్బడ్స్ స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఇవన్నీ రమేశ్వరం వెళ్లే రైలులో గత రోజు చోరీ చేసిన వస్తువులేనని నిందితులు అంగీకరించినట్లు పేర్కొన్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువుల మొత్తం విలువ సుమారు రూ.2,40,280 ఉంటుందని పోలీసులు తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరుపరచనున్నట్లు వెల్లడించారు.
