. . . నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ
హైదరాబాద్, బతుకమ్మ :
పురాతన హిందూ ఆలయాలు సమాజ ఐక్యతకు కేంద్రబిందువులని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్య నారాయణ అన్నారు. సికింద్రాబాద్ జనరల్ బజార్ ప్రాంతంలో సుమారు 400 సంవత్సరాల చరిత్ర కలిగిన వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ పునఃనిర్మాణం, విగ్రహ పునఃప్రతిష్టాపన మహోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య అమ్మవారి విగ్రహాన్ని శాస్త్రోక్తంగా ప్రతిష్టించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వాసవి అమ్మవారి ఆలయం శతాబ్దాల చరిత్రకు ప్రతీక అని, ఇలాంటి పురాతన దేవాలయాల పునర్నిర్మాణం మన సంస్కృతి, సనాతన ధర్మ పరిరక్షణకు బలాన్నిస్తుందన్నారు. అలాగే అమ్మవారి కృపాకటాక్షాలతో రాష్ట్ర ప్రజలందరికీ శాంతి, సౌఖ్యం, ఆయురారోగ్యాలు, ఐశ్వర్యం కలగాలని ప్రార్థించారు. పునఃనిర్మాణం అనంతరం ఆలయం మరింత వైభవంగా, శోభాయమానంగా దర్శనమిస్తోందని, భక్తుల భారీ సమక్షంలో జరిగిన ఈ మహోత్సవం ఆధ్యాత్మిక వాతావరణాన్ని నెలకొల్పిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ ట్రస్ట్ సభ్యులు, ఆర్యవైశ్య సంఘ ప్రతినిధులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

