. . . అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుట్టి నడిపి నాగన్న
రెంజల్, బతుకమ్మ
భారత ప్రభుత్వం అమెరికా వాణిజ్య ఒప్పందం నుంచి వైదొలగాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు పుట్టి నడిపి నాగన్న డిమాండ్ చేశారు. ఈ విషయమై అఖిలభారత ఐక్య రైతు సంఘం, అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రెంజల్ మండల్ ఎమ్మార్వో కి వినతి పత్రం అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారత దేశం అమెరికాకు లొంగిపోయి ఏకపక్షంగా వాణిజ్య స్వేచ్ఛ ఒప్పందం చేసుకుందన్నారు. అమెరికా దేశం నుంచి మొక్కజొన్న, పత్తి, సోయాబీన్ మన దేశానికి ఎలాంటి సుంకాలు లేకుండా దిగుమతి చేస్తారని, ఆ దేశంలోని రైతులకు పంటలపై 50% సబ్సిడీ ఇస్తారని పేర్కొన్నారు. కానీ భారతదేశంలో వ్యవసాయం చేసే రైతులకు మూడు శాతం మాత్రమే సబ్సిడీ ఇస్తున్నారని, మన దేశ వ్యవసాయ ఉత్పత్తుల ఖర్చులతో పోల్చితే అమెరికా రైతుల ఉత్పత్తిలో ఖర్చులు చాలా తక్కువని, ఈ ఒప్పందంతో వారి ఉత్పత్తులు మన దేశంలోకి విచ్చలవిడిగా దిగుమతి అవుతాయని తెలిపారు. మన రైతాంగం పండించిన పంటలను అమ్ముకునే దారి లేక దివాలా తీస్తున్నారని, మన దేశంలో పంటలను మద్దతు ధర కంటే తక్కువకే అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గుమ్మల గంగాధర్, పార్వతి రాజేశ్వర్, రెంజల్ మండలం నాయకులు సిద్ధ, పోశెట్టి, ఎర్రన్న, మన్నె తదితరులు పాల్గొన్నారు.
