. . . నామినేషన్ సెంటర్ల వద్ద ప్రతిష్ట పోలీసు బందోబస్తు
. . . జిల్లాలో ఎన్నికల నియమావళి పకడ్బందీగా అమలు
. . . కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర
కామారెడ్డి, బతుకమ్మ:
మున్సిపల్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాన్ని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర సందర్శించారు. నామినేషన్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన భద్రత ఏర్పాట్లు, బారికేడ్లు, పోలీస్ బందోబస్తును ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించి విధుల్లో ఉన్న అధికారులకు సిబ్బందికి పలు కీలక సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నామినేషన్ కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, అక్కడ ఉన్న అధికారులను ఆదేశించారు. అభ్యర్థులు వారి అనుచరులు ఎన్నికల ప్రవర్తన నియమావళి కచ్చితంగా పాటించాలని, నిబంధనకు విరుద్ధంగా ఎక్కువ మంది రావడం, నినాదాలు చేయడం, ర్యాలీలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో సోషల్ మీడియా వేదికగా అసత్య ప్రదారాలు చేయడం, ఇతరుల మనోభావాలను కించపరిచేలా పోస్టులు పెట్టడం లేదా మతపరమైన విద్వేషాలు రెచ్చగొట్టడం వంటి చర్యలకు పాల్పడితే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. జిల్లా కార్యాలయంలో ప్రత్యేక బృందం ప్రతి పోస్టును నిశితంగా గమనిస్తుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి టౌన్ ఎస్ హెచ్ ఓ శ్రీహరి, మున్సిపల్ అధికారులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

