- ఫిర్యాదులపై విచారణ ఏది
- వ్యవసాయ శాఖలో అంతులేని అవినీతి
- డిజిటల్ క్రాఫ్ సర్వే నేపథ్యంలో అవినీతి వెలుగులోకి
నిజామాబాద్, బతుకమ్మ : నిజామాబాద్ వ్యవసాయ శాఖ అవినీతి పుట్టలు పగులుతున్నాయి. అప్పటి వరకు వ్యవసాయ శాఖలో అంతా సవ్యంగా ఉందని అనుకుంటున్న తరుణంలో నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ విస్తరణాధికారులు (ఏఈవో)లు తాము డిజిటిల్ క్రాఫ్ సర్వే చేయమని మొండికేయడంతో అవినీతి, అక్రమాల వ్యవహరాలు వెలుగులోకి వచ్చాయి. ఏఈవోలు తాము సర్వే చేయమంటే అవినీతి ఎలా బహిర్గతమౌతుందన్న ప్రశ్న తలెత్తవచ్చు. ఏఈవోలు కచ్చితంగా వ్యవసాయ శాఖ కమిషనర్ ఆదేశాలను పాటించి డిజిటల్ క్రాఫ్ సర్వేను చేయాల్సిందేనని రేంజల్ మండలం వ్యవసాయాధికారి సొంత శాఖ గ్రూప్ లో చేసిన పోస్టు వివాదానికి దారి తీసింది. ఈ విషయంలో ఏఈవోలు తాము డిజిటల్ క్రాఫ్ సర్వే చేయమని రాష్ట్రంలో ఎక్కడ కూడా చేయడం లేదని తమపై ఏవో ఒత్తిడి తెస్తున్నాడని జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ చాంబర్ లో ధర్నా చేసిన విషయం తెల్సిందే. ఆ నాటి నుంచి వ్యవసాయ శాఖలో జరిగిన అవినీతి, అక్రమాలను ఏఈవోలు, ఏవోతో పాటు జిల్లా అధికారులు ఫిర్యాదు చేశారు. సందేట్లో సడేమియాలాగా అప్పటి వరకు తమ పనులు జరిగితే చాలు, తమ అక్రమాలు బయటకు రాకపోతే చాలు వ్యవసాయాధికారులు అడిగినంత ఇచ్చుకున్నా ఫర్టిలేజర్ నిర్వాహకులు కూడా ఫిర్యాదులు చేయడంతో నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ శాఖలో జరిగిన అవినీతి, అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.
వ్యవసాయ శాఖలో ఇతరుల ఫిర్యాదు కంటే సొంత శాఖలోనే అధికారులే గతకొన్ని రోజులుగా వ్యవసాయ శాఖలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై వ్యవసాయ శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో బహిర్గతమైంది. రెంజల్ మండల వ్యవసాయాధికారి పరిగి లక్ష్మీకాంత్ రెడ్డిపై ఏఈవోలు డిజిటల్ క్రాఫ్ సర్వే చేసేది లేదని చేపట్టిన నిరసన వ్యవహరంలో పరస్పర ఫిర్యాదుల వ్యవహరం బహిర్గతమైంది. ఈ విషయంలో లిఖితపూర్వకంగా ఆధారాలతో సహా ఫిర్యాదులు చేయడంతో జిల్లా వ్యవసాయ శాఖ పరువు రోడ్డున పడొద్దని తాత్కాలిక ఉపశమనం చర్యలను చేపట్టింది జిల్లా యంత్రాంగం. ఫిర్యాదులపై వ్యవసాయ శాఖ కమిషనరేట్ నుంచి విచారణ జరుగుకముందే దిద్దుబాటు చర్యలను చేపట్టింది. వ్యవసాయ శాఖలో డిజిటల్ క్రాఫ్ సర్వే సందర్భంగా వివాదానికి కేంద్ర బిందువుగా పేర్కొంటూ రెంజల్ ఏఈవో డిప్యూటేషన్ ను రద్దు చేసింది. ఆయనను బోధన్ లోని వ్యవసాయ శాఖలో టెక్నికల్ ల్యాబ్ ఆఫీసర్ గా పరిమితం చేసింది. రెంజల్ లో ఎడపల్లి ఏవోకు ఇంచార్జి బాధ్యతలు అప్పజెప్పింది.
నిజామాబాద్ వ్యవసాయ శాఖలో తాత్కాలిక ఉపశమనం చర్యల కింద ఏవో డిప్యూటేషన్ ను రద్దు చేసిన అధికారులు ఏవో ఫిర్యాదులపై స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రధానంగా జిల్లా అధికారిపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వ్యవసాయ శాఖకు కూడా విచారణ చేపట్టకపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. కేవలం రెంజల్, బోధన్ మండలాల పరిధిలో జరిగిన అవినీతి, అక్రమాలపై పుర్తి ఆధారాలు ఉన్నప్పటికీ విచారణ ఎందుకు చేయడం లేదన్న ప్రశ్న వ్యవసాయ శాఖలో చర్చగా సాగుతుంది. కొందరు యూనియన్ లీడర్లు అధికారులను తమ గుప్పెట పెట్టుకుని శాఖను శాసిస్తున్నారని వాదనలున్నాయి. గత నెలలో జరిగిన వివాదం ఇప్పటికి సద్దుమనగనే లేదు. వ్యవసాయ శాఖ కమిషనర్ విచారణ ఎప్పుడు చేస్తారని జిల్లా అధికారులతో ఏఈవోలపై ఉన్న ఆరోపణలను నిగ్గు తేల్చుతారా లేదా అనే సంశయాలు వ్యక్తమౌతున్నాయి.
