. . . అదనంగా అట్రాసిటీ కేసు ఉన్నా బెయిల్ ఇచ్చారా
. . . బోధన్ డివిజన్ లోని ఓ పోలీస్ స్టేషన్ అధికారుల తీరుపై విమర్శలు
నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
మైనర్ బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడిపై ఫోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చిన వ్యవహరం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. జనవరి 1న బోధన్ డివిజన్ లోని ఒక విద్యా సంస్థ వసతి గృహంలో ఉన్న విద్యార్థినిని బలవంతానికి యత్నించిన యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు అందింది. బాలిక అట్టడుగు సామాజిక వర్గానికి చెందిన వారు కావడంతో పోలీసులు అట్రాసిటి కేసు కూడా అదనంగా నమోదు చేశారు. సంబంధిత పోలీస్ కేసులో యువకుడికి నోటీసులు ఇచ్చి స్టేషన్ బెయిల్ ఇచ్చినట్లు సమాచారం. స్థానికంగా రెండు వేర్వేరు సామాజిక వర్గాలకు చెందిన వారు కావడంతో కేసును ముందుగా నమోదు చేసేందుకు వెనుకాడినట్లు తెలిసింది. బోధన్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడిని అరెస్టు చేయకుండా స్టేషన్ బెయిల్ ఇవ్వడమేమిటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. హాస్టల్ లో చొరబడి అక్కడ ఉండి చదువుతున్న విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన యువకుడిపై ఫోక్సో, అట్రాసిటి కేసులను నమోదు చేసి అరెస్టు చేయకుండా ఉండడానికి పెద్ద ఎత్తున పైరవీలు జరిగినట్లు తెలిసింది. నిఘా వర్గాలకు విషయం తెలిసిన పోలీసు ఉన్నతాధికారులకు తెలియకుండా జాగ్రత్త పడ్డట్లు సమాచారం. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న యువకుడిపై చర్యలకు ఒక అధికారి అంతా తానై వ్యవహరించాడని పోలీసులు బహిరంగంగా చెబుతున్నారు.
