. . . రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ
నిజామాబాద్, బతుకమ్మ
రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడూ దళిత , వెనుకబడిన వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ అన్నారు. నిజామాబాద్లోని నూతన అంబేద్కర్ భవన్లో ఆదివారం జిల్లా మాల మహానాడు ఆధ్వర్యంలో నూతనంగా గెలిచిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు సభ్యుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జి.వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీలు ముఖ్య అతిథులుగా పాల్గొని సన్మానం చేశారు. ఈ సందర్భంగా మహమ్మద్ అలీ షబ్బీర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో ఎన్నికైన ప్రజా ప్రతినిధులు గ్రామ అభివృద్ధికి వెన్నెముక అని, ముఖ్యంగా మాల సామాజిక వర్గం నుండి ఎన్నికైన సర్పంచ్లు, వార్డు సభ్యులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అట్టడుగు వర్గాల గొంతుక కావాలన్నారు. మా ప్రభుత్వం ఎప్పుడూ దళిత , వెనుకబడిన వర్గాల సంక్షేమానికి కట్టుబడి ఉంటుందన్నారు.నిజామాబాద్ జిల్లా అభివృద్ధిలో మీ అందరి భాగస్వామ్యం అవసరమని, మీకు ఏ సమస్య వచ్చినా ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు.మాల మహానాడు వంటి సంస్థలు సమాజాన్ని ఏకం చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయన్నారు. పదవులు రావడం ముఖ్యం కాదని, ఆ పదవుల ద్వారా ప్రజలకు ఎంత సేవ చేశామన్నదే ముఖ్యం అన్నారు. నిజామాబాద్ పట్టణంలో జి.వెంకటస్వామి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని, అలాగే పెద్దపల్లి జిల్లా పేరును వెంకటస్వామి పేరు పెట్టాలని మా ప్రభుత్వాన్ని కోరుతామన్నారు. మంత్రి జి. వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ మాలల హక్కులు, భవిష్యత్తు కార్యాచరణపై ప్రత్యేక దృష్టి పెడతానన్నారు. మనం ఇక్కడ సన్మానం పొందుతున్నామంటే అది బాబాసాహెబ్ పెట్టిన భిక్షేనని, రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ల వల్లే మనకు ఈ రాజకీయ అధికారం దక్కిందన్నారు. అధికారాన్ని కేవలం మన కుటుంబాల కోసమే కాకుండా, సమాజం కోసం వాడాలన్నారు.మౌలిక వసతుల కల్పన: “గ్రామాల్లో మాల పల్లెల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించేలా కృషి చేస్తానన్నారు. డ్రైనేజీసిసి రోడ్లు,, తాగునీటి సౌకర్యాల విషయంలో ఎక్కడా రాజీ పడకుండా పనిచేయాలన్నారు. చదువు ఒక్కటే మన జీవితాలను మారుస్తుందని, మీ గ్రామాల్లోని దళిత బిడ్డలు ఉన్నత చదువులు చదివేలా మీరు ప్రోత్సహించాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న విదేశీ విద్యా నిధి వంటి పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కాకా వెంకటస్వామి ఆశయాలు ఎప్పుడూ దళితుల ఐక్యత కోసం తపించారని, అదే బాటలో నేను కూడా మీ సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తానన్నారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా, గడుగు గంగాధర్, మాల మహానాడు జాతీయ అధ్యక్షులు చిన్నయ్య,నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు దేవిదాస్, లింబాద్రి, టీఎన్జీవో నాయకులు కిషన్ తదితరులున్నారు.

