మల్యాల, బతుకమ్మ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయ స్వామిని శనివారం దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మొక్కులు చెల్లించుకున్నారు. ఈసందర్భంగా రూ. 35.19 కోట్ల టీటీడీ నిధులతో భక్తులవసతి కోసం 96 గదుల ధర్మశాల, దీక్ష విరమణ మండప నిర్మాణానికి ఆయన భూమి పూజ చేశారు. ఈసందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ కొండగట్టు అంజన్నే నన్ను కాపాడారని పేర్కొన్నారు. గతంలో జరిగిన విద్యుత్ ప్రమాదం నుంచి నేను ఎలా బయటపడ్డానో ఇప్పటికీ ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. అభివృద్ధి పనులు ప్రారంభిస్తున్నామంటే దేవుడి దయ ఉండాలని తెలిపారు. దీక్ష విరమణకు మండపం, సత్రం కాలని గతంలో నన్ను కోరారని గుర్తు చేశారు. టీటీడీ సభ్యులు, తెలంగాణ నాయకుల సమష్టి కృషితో ఇది సాధ్యమైందన్నారు. ఈకార్యక్రమంలో టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తదితర నాయకులు పాల్గొన్నారు.
