వెబ్ న్యూస్, బతుకమ్మ : హైదరాబాద్ లోని పర్యాటక ప్రాంతం దుర్గచెరువు ఆక్రమణల వ్యవహారంలో బీఆర్ఎస్ నేత, దుబ్బాక ఎమ్మెల్యేపై కేసు నమోదైంది. హైడ్రా ( హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రభాకర్ రెడ్డితో పాటు వెంకట్ రెడ్డి అనే వ్యక్తి పై పబ్లిక్ ప్రాపర్టీ డ్యామెజ్ యాక్ట్ కింద మాదాపూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. వివరాలు ఇలా.. దుర్గం చెరువు పరివాహక ప్రాంతంలోని సుమారు 5 ఎకరాల శిఖం భూమిని ప్రభాకర్ రెడ్డి అనుచరులు మట్టి, రాళ్లతో నింపి చదును చేశారు. అనంతరం ఆస్థలాన్ని ప్రైవేటు వ్యక్తుల ద్వారా ప్రైవేటు బస్సులు, ఐటీ కంపెనీల వాహనాలకు పార్కింగ్ లాట్ నిర్వహిస్తూ నెలకు సుమారు రూ. 50 లక్షల వరకు అక్రమంగా వసూలు చేస్తున్నట్లు హైడ్రా ప్రాథమిక విచారణలో తేలింది. ప్రభాకర్ రెడ్డి ఆక్రమించిన భూమిని హైడ్రా ఖాళీ చేయించింది. చెరువు సరిహద్దులను పునరుద్ధరించేందుకు అక్కడ ఫెన్సింగ్ ను ఏర్పాటు చేయనున్నారు. ఒక వైపు అసెంబ్లీ సమావేశాలు జరగుతుండగా ఎమ్మెల్యే పై భూ కబ్జా కేసు నమోదు కావడం గమనార్హం.
