. . . నిజామాబాద్ జిల్లాలో 72.56 శాతం పోలైన ఓట్లు
. . . కామారెడ్డి జిల్లాలో 77.62 శాతం పోలింగ్
నిజామాబాద్, బతుకమ్మ :
ఉమ్మడి జిల్లాలో పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. నిజామాబాద్ జిల్లాలో మధ్యాహ్నం 1 గంటల వరకు 72.56 శాతం ఓట్లు పోలయ్యాయి. నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో 8 మండలాల్లో 2,38,838 మంది ఓటర్లకు గాను 1,73,296 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. డిచ్ పల్లి మండలం లో అత్యల్పంగా 43,382 మంది ఓటర్లకు గాను 27190 మంది మాత్రమే ఓట్లు వేశారు. నిజామాబాద్ రూరల్ మండలం లో 80.47 శాతం మంది అత్యధికంగా ఓటు హక్కు వినియోగించుకున్నార ని అధికారులు తెలిపారు. ఇప్పటికే పోలింగ్ బూత్ లలో ఉన్న వారికి ఓటు వేసేందుకు అవకాశం ఉన్నందువలన మొత్తం వివరాలు తదుపరి వెల్లడిస్తామని అధికారులు తెలిపారు….

రెండో విడత కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి, జుక్కల్ నియోజకవర్గంలోని 8 మండలంలోని గ్రామ పంచాయతీ ఎన్నికలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం 1 గంటల తర్వాత కూడా కొనసాగుతుంది. కామారెడ్డి జిల్లాలో నిర్ణిత 1 గంటల సమయం వరకు 77.62 శాతం పోలింగ్ జరిగింది. మొత్తం 1,64,301 ఓటర్లకు గాను 1,27,530 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం ఎల్లారెడ్డి మండలం లో 87.81 శాతం అత్యధికంగా ఓటు హక్కును వినియోగించు కోగా, అత్యల్పంగా పిట్లం మండలం 61.10 మంది ఓట్లు వేశారు.చాలా పోలింగ్ కేంద్రాల్లో ఓటర్ల క్యూ లైన్ లో ఉండటంతో వారిని ఓటు వేసేందుకు అనుమతించారు. పోలింగ్ ప్రక్రియ ఇంకా కొనసాగుతుంది. పోలింగ్ ప్రక్రియ పూర్తయిన సెంటర్ లలో మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమౌతుందని అధికారులు తెలిపారు. రెండో విడత పంచాయతీ ఎన్నికలలో పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

