హైదరాబాద్, బతుకమ్మ: తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ ఆమ్రపాలికి చుక్కెదురైంది. ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. ఆమ్రపాలి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆరువారాలకు వాయిదా వేసింది. ఏపీ కేడర్ కు కేటాయిస్తూ డీవోపీటీ ఆదేశాలను నిలుపుదల చేయాలని ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, వాణి ప్రసాద్, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి, సృజన, శివశంకర్, హరికిరణ్ గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఐఏఎస్ అధికారులతో పాటు డీవోపీటీ తరఫున వాదనలు విన్న కోర్టు వారి పిటిషన్లను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఏపీ కేడర్కు కేటాయించిన అధికారులు వెంటనే రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. క్యాట్ ఆదేశాలను హైకోర్టు సమర్థించింది. అభ్యంతరాలు, సమస్యలు ఏవైనా ఉంటే తర్వాత వింటామని ఐఏఎస్ అధికారులకు హైకోర్టు స్పష్టం చేసింది. ఆమ్రపాలి ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొ రేషన్ ఎండీగా నియమితులయ్యారు. అనంతరం క్యాట్ లో దీన్ని అమ్రపాలి అప్పీల్ చేయడంతో తెలంగాణకు తిరిగి రావాలని తీర్పు ఇచ్చింది. ఈ ఉత్తర్వులను డీవోపీటీ హై కోర్టులో సవాల్ చేసింది. దీంతో తెలంగాణ హైకోర్టు క్యాట్ తీర్పుపై స్టే విధించింది.
