హరి హర సుతనే అయ్యప్ప..
. . . అంగరంగ వైభవంగా పండుగగా పడి పూజ
నిజామాబాద్ సీటి, బతుకమ్మ :
హరి హర సుతనే అయ్యప్ప.. స్వామియే శరణం అయ్యప్ప.. స్వామీ శరణం అయ్యప్ప శరణం.. అంటు అయ్యప్ప శరణు ఘోషతో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ నివాసం మారు మ్రోగింది.శ్రీ అయ్యప్ప స్వామి దివ్య ఆశీస్సులతో “పడిపూజ మహోత్సవాన్ని” బ్రహ్మశ్రీ బల్యపల్లి సుబ్బారావు గురు స్వామి ఆధ్వర్యంలో శాసన సభ్యులు ధన్ పాల్ సూర్యనారాయణ నివాసంలో అంగరంగ వైభవంగా, కన్నుల పండుగగా నిర్వహించారు. ఆదివారం ఉదయం నుంచి వాస్తు పూజ, గణపతి, సుబ్రహ్మణ్య తదితర దేవత షోడశోపచార పూజ, అయ్యప్ప స్వామి ప్రాణ ప్రతిష్ట, పడి పూజ, అయ్యప్ప స్వామికి అభిషేకం, మంత్రపుష్పం తదితర క్రతువులతో పూజలు నిర్వహించారు.పడిపూజ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ- ధన్ పాల్. మణిమాలా దంపతులు తో పాటు సకుటుంబ సపరివార సమేతంగా పాల్గొని ప్రత్యేక పూజలు చేపట్టారు.

పడిపూజ మహోత్సవం వేడుకలు తిలకించడానికి అశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. పడిపూజ సందర్భంగా అయ్యప్ప స్వాములు, భక్తుల కోసం ఎమ్మెల్యే బిక్ష ప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా గురు స్వామి మాట్లాడుతూ ..అయ్యప్ప స్వామి ఆశీస్సులతో నిజామాబాద్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోంది. హిందూ ధర్మ పరిరక్షణ కోసం పాటు పడే నాయకుడు దొరకడం మన అదృష్టం. భక్తుల కోసం ఇంత అద్భుతంగా కార్యక్రమాన్ని నిర్వహించిన ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అని పేర్కొన్నారు. అయ్యప్ప స్వామి పడి పూజ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మన భారతీయ సంస్కృతిలో కుటుంబ వ్యవస్థకు ఉన్న విలువ అపారం. సంస్కారం, సేవ, పరస్పర గౌరవం, ప్రేమ ఇవన్నీ మన కుటుంబాన్ని నిలబెట్టే వేర్లు. ఈ విలువల అన్నింటినీ కాపాడుతూ మన సనాతన ధర్మం వేల ఏళ్లుగా నడిచిపోతోంది. ప్రపంచం మారినా, యుగాలు మారినా, మన కుటుంబ వ్యవస్థ మాత్రం ధర్మాధారంగా వెలుగుతూ వస్తుంది. అయ్యప్ప స్వామి భక్తి కూడా అంతే పవిత్రం,ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు 41 రోజుల దీక్ష లో ప్రవేశిస్తారు. ఈ మాల ధారణ అంటే కేవలం ఆచారం కాదు, ఇది మనస్సును శుద్ధి చేసే సాధన, శరీరాన్ని నియంత్రించే నియమం, ఆత్మను ఉన్నత స్థితికి చేర్చే మార్గము ఈ 41 రోజులు భక్తులు పాటించే అహింస, సత్యం, సాధన ఇవన్నీ మన సనాతన ధర్మం నేర్పిన విలువలు.ఒకరి మీద ఒకరు గౌరవం, సమానత్వం, అన్నదమ్ముల బంధం, ఇవే అయ్యప్ప స్వామి భక్తి అని తెలిపారు అయ్యప్ప స్వామి ఆశీస్సులతోసమాజం లో ఐక్యత, కుటుంబాల్లో ఆనందం, ప్రతి ఇంట్లో ఆరోగ్యం, సంపద, శాంతి ప్రసాదించాలని ప్రార్థిస్తున్నాను అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా ముధోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్, జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి , బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కుల చారి ,మల్లారం ఆశ్రమం పీఠాధిపతి శ్రీ శ్రీ శ్రీ పిట్ల కృష్ణ మహారాజ్ , గుండయ్య స్వామి,బీజేపీ నాయకులు, ప్రముఖులు, జిల్లా అధికారులు , భక్తులు తదితరులు పాల్గొన్నారు…
