- అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పెద్దలను గౌరవించడం మానవత్వానికి ప్రతీక అని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పేర్కొన్నారు. ప్రపంచ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా మహిళ, శిశు, దివ్యాంగులు, వయోవృద్ధులు, ట్రాన్స్జెండర్ వ్యక్తుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బుధవారం న్యూ అంబేద్కర్ భవన్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వయోవృద్ధులు మన సంస్కృతి, కుటుంబ వ్యవస్థకు మూలస్తంభాలు. వారి అనుభవం, జ్ఞానం యువతకు దారి చూపే వెలుగు అని తెలిపారు. ఇటీవలి కుటుంబ నిర్మాణ మార్పులతో అనేక మంది పెద్దలు ఒంటరితనాన్ని ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం వయోజనుల కోసం అమలు చేస్తున్న ఎల్డర్ లైన్ 14567, ఆరోగ్య శిబిరాలు, సీనియర్ సిటిజన్స్ హోమ్స్, డే కేర్ సెంటర్స్ వంటి పథకాలను అందిస్తుందని తెలిపారు. పెద్దలకు ప్రభుత్వ సేవలతో పాటు కుటుంబ ప్రేమ అత్యంత ముఖ్యమైనదని తెలిపారు. వయోవృద్ధుల సంక్షేమం కోసం ప్రభుత్వం, సమాజం, కుటుంబం కలిసి పనిచేయాలి” అని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) అంకిత్, ట్రైనీ కలెక్టర్ కెరోలిన్, డీసీపీ బస్వా రెడ్డి, తెలంగాణ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధి రామ్ మోహన్, ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ అంజయ్య, సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ రాజేశ్వర్, జిల్లా రక్షణ–శిశు సంక్షేమ విభాగం నుండి డా. రవి తేజ, మహిళా, శిశు సంక్షేమ శాఖ పీడీ రసోలి, స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతినిధి దరం గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.

