నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : నగరంలోని రెండవ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో దుండుగులు బాలిక కిడ్నాప్ కు యత్నించారు. ఈ సంఘటన సోమవారం ఉదయం జరిగింది. హైమద్పుర కాలనీకి చెందిన ఎక్సైజ్ ఉద్యోగి ఇర్ఫాన్ కూతురు స్థానికంగా గోల్డెన్ జూబ్లీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో చదువుతోంది. ఉదయం పాఠశాలకు వెళుతుండగా నిజామాబాద్ హోటల్ వెనుక భాగంలో గుర్తు తెలియని వ్యక్తులు బాలికను కిడ్నాప్ చేసి కారులో ఎక్కించుకున్నారు. బాలిక గురుద్వార ప్రాంతం వద్ద కారు నెమ్మది కాగానే డోర్ తీసుకొని తప్పించుకుంది. ఇంటికి చేరి జరిగిన విషయాన్ని తెలపడంతో కుటుంబ సభ్యులు స్థానిక పోలీస్ స్టేషన్లో లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. పాఠశాలకు వెళ్తున్న విద్యార్థిని కిడ్నాప్ వెనుక ఉన్న వాస్తవాలను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈమేరకు స్థానికంగా ఉన్న సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. బాలిక కిడ్నాప్ వ్యవహారం జిల్లా కేంద్రంలో కలకలం రేపింది. బాలికను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన వ్యక్తులు ఎవరై ఉంటారో అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.
