. . . జిల్లా న్యాయసేవాధికార సంస్థ చోరవతో పరిష్కరం దిశగా
నిజామాబాద్, బతుకమ్మ :
భారతదేశ రక్షణ కోసం పాటుపడిన సైనికులు వారు. కొండలు, కొనలు, దేశ సరిహద్దులు వారికి నివాస స్థలాలు అయినవి.దేశమాత సేవలో తరించిన జీవితాలు వారివి, సైనిక సేవల అనంతరం మాజీలు అయ్యారు.ఉండటానికి ఇంత ఖాళీ స్థలం కావాలంటు వారు జిల్లా అధికార యంత్రాంగానికి దరఖాస్థులు సమర్పించుకోవడంతో 1989 లో నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రి డి. సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ అజెయంద్ర పాల్ లు 130 మంది మాజీ సైనికులకు పట్టాలు అందజేశారు. నిజామాబాదు మండలం సారంగపూర్ గ్రామ శివారులో సర్వే నంబర్ 58 లో మొత్తం 33 ఎకరాలకుగాను 7.20 ఎకరాలు మాజీ సైనికులకు కేటాయించారు.ఆ స్థలంలో రహదారులు,నీటి వసతులు, విధ్యుత్ సౌకర్యాలు ఏర్పాటు చేయకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారిపోయింది. దీనికి తోడు భూగర్భ, ఘనుల శాఖ సదరు స్థలంలో మొరం, రాళ్ళ తవ్వకానికి అనుమతి ఇవ్వడంతో అంత గుంతలమయం కావడం మూలంగా అక్కడికి వెళ్లడమే గగనమైపోయింది. ఇలా ముపై ఐదు ఏళ్ళు కాలగర్భంలో కలిసిపోయినయ్. అధికారులకు, రాష్ట్ర రాజ్య సైనిక బోర్డుకు, దేశ ప్రధాన మంత్రులకు వినతుల వెల్లువ కొనసాగిపోయింది. కాగితం మీద రాసిన రాతలన్ని రాలిపోయినయ్. పట్టువదలని విక్రమార్కుల్లా వాళ్ళ ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. చీకట్లో చిరు దివ్వెలలాగ వారికి నిజామాబాద్ సైనిక సంక్షేమ కార్యాలయంలో నిజామాబాద్ జిల్లా న్యాయసేవ అధికార సంస్థ ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ క్లినిక్ కనపడింది. అక్కడ సంస్థ తరపున న్యాయసేవలు అందిస్తున్న న్యాయ సహాయ న్యాయవాది బాలరాజ్ నాయక్ ను కలిసి తమ గోడును వెళ్ళబోసుకున్నారు. గత మూడు దశబ్దాలకు పైగా తాము ఇళ్ల స్థలాల పరిరక్షణ కోసం పడుతున్న తపనను తెలిపారు. డాక్యుమెంట్స్ తో కూడిన దరఖాస్తును వారు జిల్లా న్యాయసేవ అధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు కు అందించారు. మాజీ సైనికుల దరఖాస్తును స్వీకరించిన ఆయన దానిని ఫ్రీ లిటిగెషన్ కేసుగా నంబర్ కేటాయించి నిజామాబాద్ రూరల్ మండల తహసీల్దార్ కు నోటిస్ పంపించి, వివరణ కోరారు.మంగళవారం న్యాయసేవ సంస్థ కార్యాలయానికి వచ్చిన ఇంచార్జీ తహసీల్దార్ వినయ్ సాగర్ ప్రస్తుతం అట్టి స్థలం కొండలు, గుట్టలు, బొందలతో నిండి ఉన్నదని ప్లాట్స్ చదును చేసి ఇవ్వడానికి అనువుగా లేదని భూగర్భ, ఘనుల శాఖ పేర్కొన్నది వారి నివేదికను అందజేసి,రెవిన్యూ శాఖ దగ్గర ప్రస్తుతం ఎలాంటి రికార్డులు లేవని, రాళ్లు రప్పలతో నిండి ఉన్నదని, కొంత జైలు ఉన్నదని,రహదారులు కూడా లేవని, మాజీ సైనికులకు ఇచ్చిన పట్టాలు ఒక సంవత్సరంలోపు వారు స్వాదీనపరచుకోలేదని విన్నవించారు.ప్రస్తుతం స్థలం లేదని అయిన అది నిజామాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోకి వెళ్లినందున వారే కలుగజేసుకోవాలని కోరారు.మాజీ సైనికుల అభ్యర్తనలు, నిజామాబాద్ రూరల్ తహసీల్దార్ వినయ్ సాగర్ విన్నపాలు విన్న న్యాయసేవ సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి ఉదయ్ భాస్కర్ రావు తదుపరి న్యాయ విచారణకు గాను నగర పాలక సంస్థ కు నోటీసులు అందజేసీ వివరణ అడగనున్నారు.ఎందరో దేశ ప్రధానులు, మరేందరో ముఖ్యమంత్రులు, ఇంకొందరు జిల్లా కలెక్టర్లు మారారు, ఇగ ప్రజా ప్రతినిధులు గూర్చి చెప్పేది ఏమున్నది.కాని మారనిదల్ల మాజీ సైనికుల ఇళ్ల స్థలాల రూపురేఖలే. వాళ్ళ చూపులన్ని, ఆశలన్నీ దారిదీపమై వెలుగుతున్న జిల్లా న్యాయసేవ సంస్థ వైపే. న్యాయదేవత చల్లన్ని చూపుకై ఎదురుచూస్తూ, న్యాయం మా వైపే ఉన్నదంటు, కడవరకు పోరాడుతాం న్యాయబద్దంగా అంటున్నారు మాజీ సైనికులు, వారి కటుంబ సభ్యులు. జిల్లాకోర్టు ప్రాంగణం ముంగిట ఉన్న న్యాయదేవత విగ్రహానికి నమస్కరిస్తు మల్లోక్క వాయిదాకు వస్తామంటూ వెనుదిరిగిన మాజీ సైనికులు.

