- న్యూరో సర్జన్ శ్రీకృష్ణాదిత్య
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : స్ట్రోక్ అనేది మెదడులో రక్తప్రసరణ ఆగిపోవడం లేదా రక్తనాళం పగిలిపోవడం వల్ల సంభవించే అత్యవసర వైద్య పరిస్థితి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి 4 సెకన్లకూ ఒక వ్యక్తి స్ట్రోక్కు గురవుతున్నారని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అక్టోబర్ 29న ప్రపంచవ్యాప్తంగా బ్రెయిన్ స్ట్రోక్ డే సందర్భంగా నిజామాబాద్ మెడికవర్ ఆసుపత్రి న్యూరో సర్జన్ డా. శ్రీకృష్ణాధిత్య మాట్లాడుతూ స్ట్రోక్ వచ్చిన తర్వాత మొదటి 4 నుంచి 5 గంటలు గోల్డెన్ హవర్అని పిలుస్తారు.ఈ సమయం లోపల రోగికి సరైన చికిత్స అందితే మెదడు నష్టాన్ని గణనీయంగా తగ్గించి,రోగి పూర్తిగా కోలుకునే అవకాశం ఉంటుందని, ఆలస్యం జరిగిన ప్రతి నిమిషం వేల మెదడు కణాల నష్టానికి దారితీస్తుందన్నారు. స్ట్రోక్ లక్షణాలను తక్షణం గుర్తించడం అత్యంత అవసరమని, ముఖం వంగిపోవడం, చేయి బలహీనపడటం, మాట తడబడటం వంటి లక్షణాలు కనిపించగానే వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లాలన్నారు. ప్రజలు గోల్డెన్ అవర్లో స్పందిస్తే ప్రాణాలు కాపాడవచ్చన్నారు. బీ ఫాస్ట్ పద్దతి ద్వారా స్ట్రోక్ను గుర్తించవచ్చన్నారు. అందులో అకస్మాత్తుగా స్పృహ తప్పడం, చూపు తగ్గిపోవడం, ముఖం ఒక వైపుకు వంగిపోవడం, చేయి బలహీనపడటం, మాట తడబడటం లేదా స్పష్టంగా మాట్లాడలేకపోవడం, వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లడం మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రక్తపోటు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్, పొగతాగడం వంటి ప్రమాద కారకాలను నియంత్రించడం ద్వారా స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించవచ్చన్నారు.
