నవీపేట్, బతుకమ్మ : గోదావరి వరద ముంపు రైతుల ఆధ్వర్యంలో సోమవారం నిజామాబాద్ – బాసర రహదారిపై యంచ గ్రామం వద్ద రైతులు మహాధర్నా రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. గత రెండేళ్ల క్రితం వచ్చిన వరదల వల్ల నవీపేట మండలంలోని సుమారు తొమ్మిది గ్రామాల్లో వేల ఎకరాల పంట పొలాలు నీట మునిగి రైతులు నష్ట పోయారని తెలిపారు. రైతులను ఆదుకోవడం కోసం ప్రభుత్వం ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో పూర్తిగా విచారణ జరపలేదన్నారు. ఈ ప్రాంతంలోని గెలిచినటువంటి ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి రైతులకు భరోసా ఇచ్చిన పాపాన పోలేదని తెలిపారు. నష్టపోయిన తొమ్మిది గ్రామాల రైతులు కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే నష్టపోయిన రైతులకు ఎకరానికి రూ.50వేల చొప్పున నష్టపరిహారాన్ని చెల్లించాలని డిమాండ్ చేశారు. కొన్ని ఎకరాలలో భూమిలో ఇసుక దిబ్బలు నిండిపోయి అగమ్యగోచరంగా ఉందని ఆ రైతులకు రూ.80000 చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన కార్యక్రమాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్ష నాయకులు సంజీవ్, లాలయ్య, నర్సింగ్ రావు, సరీన్ పిల్లి శ్రీకాంత్, తెడ్డు పోశెట్టి, ప్రవీణ్, హనుమండ్లు, సంజీవరావు, శైలేష్, ప్రవీణ్, రైతులు పాల్గొన్నారు.

