హైదరాబాద్, బతుకమ్మ : పెంచిన బస్ చార్జీలను నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ గురువారం చలో బస్ భవన్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. చలో బస్ భవన్ ఉద్రిక్త పరిస్థితుల మధ్య కొనసాగింది. కాంగ్రెస్ పార్టీ సర్కార్ నడుపుతుందో, సర్కస్ నడుపుతుందో వాళ్లకే అర్ధం కావడం లేదని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ లోని బస్ భవన్ వద్ద ఆయన మాట్లాడారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి పురుషులకు రెట్టింపు వసూళ్లు చేస్తున్నారన్నారు. బస్సు పాసుల చార్జీలు 25 శాతం పెంచారన్నారు ఒక్కొ కుటుంబంపై టికెట్ ధరల భారం పెరిగిందన్నారు. గురువారం ఉదయం హౌస్ అరెస్ట్ చేశారని, తర్వాత వెళ్ల వచ్చని చెప్పి, మళ్లీ అరెస్టు చేస్తున్నారని ఏం చేస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. మెట్రో, ఆర్టీసీ లేకుండా మొత్తం ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతుందన్నారు. అనంతరం నాటకీయ పరిణామాల మధ్య కేటీఆర్, హరీశ్ రావు, పద్మారావు గౌడ్, ఇతర నేతలు బస్ భవన్ లోపలికి వెళ్లారు. పెంచిన చార్జీలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డిని కలిసి పార్టీ తరపున వారు లేఖ అందజేశారు.
