హైదరాబాద్, బతుకమ్మ : బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు, ఎన్నికల ఏర్పాట్లపై తెలంగాణ కాంగ్రెస్ నేతల జూమ్ మీటింగ్ నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. అభ్యర్థుల ఎంపిక, నామినేషన్లపై చర్చలు జరిపారు. సమర్థవంతమైన అభ్యర్థులను నామినేషన్ కు ఎంపిక చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. జూమ్ మీటింగ్ లో కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. జిల్లాల్లోని నాయకులతో ఇన్ చార్జ్ మంత్రులు అత్యవసరంగా మాట్లాడాలని, అభ్యర్థులను ఫైనల్ చేసి బీ ఫారం ఇవ్వాలని, నో డ్యూ సర్టిపికేట్ లు ఇప్పించాలని, లీగల్ సెల్ ను యాక్టివ్ చేయాలని సూచించారు. హైదరాబాద్ లోని గాంధీ భవన్ లో లీగల్ టీమ్ తో పాటు సమన్వయం కోసం ఒక టీమ్ అందుబాటులో ఉంచాలన్నారు. హైకోర్టులో బీసీ రిజర్వేషన్ కేసుపై పీసీసీ అధ్యక్షుడు పర్యవేక్షణ చేయాలని సూచించారు. కోర్టు తీర్పు తరవాత తదుపరి కార్యాచరణ కోసం రాత్రి మరో సమావేశం జరగనున్నట్లు తెలుస్తోంది. తొలి విడత కోసం రాత్రికి అభ్యర్థుల జాబితా సిద్ధం కావాలని సీఎం ఆదేశించారు.
