- తెలంగాణ జాగృతి కార్యాలయంలో బతుకమ్మ సంబురాలు
- బతుకమ్మ పేర్చి, బతుకమ్మ ఆడిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
హైదరాబాద్, బతుకమ్మ : తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే పండుగ బతుకమ్మ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో సోమవారం ఘనంగా బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. మహిళా నాయకులు, మహిళలతో కలిసి బతుకమ్మ పేర్చి కవిత బతుకమ్మ ఆడారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడారు. ‘‘ప్రపంచంలో ఎక్కడ లేనటువంటి పండుగ మనకుంది. ఇలాంటి పండుగ రోజు ఆడబిడ్డలను ప్రభుత్వం గుర్తించాలి. ఈ ప్రభుత్వం ఆడబిడ్డలకు ఒకటి కాదు, రెండు చీరలిస్తామని గతంలో చెప్పింది. కానీ మొత్తానికి ఎగ్గొట్టిన ఘనత సాధించింది. ఆడబిడ్డలను గౌరవించటమంటే కేవలం బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పటం కాదు. ఆడబిడ్డలకు మాట ఇచ్చినట్లు నెలకు రూ. 2500 లతో పాటు, 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ స్కూటీలు ఇవ్వాలి. ముఖ్యంగా బతుకమ్మ పండుగకు ఇవ్వాల్సిన చీర బతుకమ్మ చీర పేరుతోనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. మహిళలకు ఇచ్చే చీరలకు బతుకమ్మ చీరలు లేదంటే తెలంగాణ ఆడబిడ్డల చీర అని పేరు పెట్టాలి. ఇందిరమ్మ చీర అని పేరు పెడితే మాత్రం ఊరుకునేది లేదు. ఎన్ని ఇబ్బందులున్నా సరే వందల ఏళ్లుగా ఆడబిడ్డలు ఈ పండుగను నిలుపుకుంటూ వచ్చారు. గాజులరామారంలో హైడ్రా ఇళ్లను కూల్చేసిన సందర్భంగా నిరసనగా ఆడబిడ్డలు అక్కడే బతుకమ్మ ఆడారు. ఎంత కష్టమైనా, సంతోషమైనా సరే ఈ పండుగను నిలబెట్టుకోవాలని ఆడబిడ్డలను కోరుతున్నా. జాగృతి తరఫున ఇప్పటికే 110 బతుకమ్మ పాటలను విడుదల చేశాం. బతుకమ్మ పండుగను నిలబెట్టేందుకు జాగృతి తరఫున నిరంతర ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుంది’’ అని అన్నారు.

- బతుకమ్మ పాట ఆవిష్కరణ..
బతుకమ్మ పండుగ సందర్భంగా తెలంగాణ జాగృతి రూపొందించిన ‘‘బతుకమ్మ పాట 2025’’ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం సాయంత్రం ఆవిష్కరించారు. మాట్ల తిరుపతి రచించిన పాట మంగ్లీ పాడగా ఎస్ కే మదీన్ సంగీతం అందించారు. పాట ఆవిష్కరణ కార్యక్రమంలో మాట్ల తిరుపతి, నవీన్ ఆచారి తదితరులు పాల్గొన్నారు.

