- పోలీస్ కమిషనర్ సాయి చైతన్య
భీంగల్, బతుకమ్మ : లింబాద్రి గుట్ట బ్రహ్మోత్సవాలకు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య అధికారులను ఆదేశించారు. భీంగల్ మండలంలోని లింబాద్రి గుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ని ఆయన శనివారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రాబోయే లింబాద్రి గుట్ట జాతర సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లపై సూచనలు జారీ చేశారు. భక్తుల రాకపోకలు సాఫీగా సాగేందుకు ట్రాఫిక్ డైవర్షన్ ప్లాన్ అమలు చేయాలని తెలిపారు. పార్కింగ్ ప్రాంతాలను సక్రమంగా గుర్తించి భక్తులను సులభంగా గమ్యస్థానానికి చేర్చేలా చూడాలన్నారు. భక్తులకు తాగునీరు, వైద్య సహాయం, లైటింగ్ వంటి ప్రాథమిక సౌకర్యాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. పోలీస్ సిబ్బంది స్నేహపూర్వకంగా భక్తులకు మార్గదర్శనం చేయాలని, ఎలాంటి అవాంఛనీయ పరిస్థితులు తలెత్తకుండా నిఘా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ జాతర విజయవంతంగా, శాంతియుతంగా నిర్వహించబడేందుకు పోలీసులు, రెవెన్యూ, దేవాదాయ, స్థానిక సంస్థల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఆయన వెంట భీంగల్ సీఐ సత్యనారాయణ, భీంగల్ ఎస్సై సందీప్, ఆలయ ప్రధాన అర్చకులు ఉన్నారు.

