నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : నిజామాబాద్లోని నిషిత డిగ్రీ కళాశాలలో హిందీ పక్షోత్సవంలో (సెప్టెంబర్ 14 నుండి 28 వరకు) భాగంగా బుధవారం హిందీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రముఖ హిందీ సేవకులు, హిందీ అసోసియేట్ ప్రొఫెసర్ డా. వాసాల వరప్రసాద్ గారు “డిజిటల్ మాధ్యమాల్లో హిందీ భాష స్థితి మరియు అవకాశాలు” అనే అంశంపై ప్రత్యేక ఉపన్యాసం ఇచ్చారు. ఆయన మాట్లాడుతూ – “ఇప్పుడు హిందీ జాతీయ భాష, రాజభాష అనే హద్దులను దాటి అంతర్జాతీయ భాషగా అవతరించింది. ఇంటర్నెట్, వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి డిజిటల్ మాధ్యమాల ద్వారా హిందీ భాష విస్తృతంగా ప్రపంచమంతటా వ్యాప్తి చెందింది. ఇది హిందీ ప్రాముఖ్యతను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తోంది. కృత్రిమ మేధస్సు యుగంలో విద్యార్థులు సరైన భాషా అవగాహన, అభివ్యక్తి అభ్యాసం ద్వారా విద్య, అనువాదం, మీడియా, యూట్యూబ్ వంటి రంగాల్లో అనేక అవకాశాలను పొందగలరు. హిందీ ఉపాధ్యాయులు, అనువాదకులు, హిందీ అధికారులుగా విజయాన్ని సాధించాలంటే విద్యార్థులు హిందీపై ప్రావీణ్యం సాధించాలి” అని తెలిపారు. కళాశాల డైరెక్టర్ డా. ఓ.యం. శేఖ్ గారు అధ్యక్షత వహిస్తూ – “మన రాజభాష హిందీకి గౌరవం ఇవ్వడం ప్రతి పౌరుని బాధ్యత. విద్య, వ్యాపారం, ప్రభుత్వ కార్యాలయాల్లో హిందీ వినియోగం పెంపొందితేనే జాతీయ ఐక్యత సాధ్యం అవుతుంది” అని పేర్కొన్నారు. హిందీ దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించిన హిందీ విభాగాధిపతి శ్రీమతి లత, మెఘ గారు మరియు విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా విద్యార్థులు హిందీ ఉపన్యాస, వ్యాస రచన, కవితల ద్వారా హిందీ ప్రాముఖ్యతను ఆవిష్కరించారు. రెండు రోజుల క్రితం నిర్వహించిన వ్యాసరచన మరియు ఉపన్యాస పోటీ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అనంతరం డా. వాసాల వరప్రసాద్ గారిని శాలువా కప్పి సన్మానించారు. కార్యక్రమంలో అకాడెమిక్ సలహాదారు ప్రొఫెసర్ సాయిలు, ప్రిన్సిపాల్ డా. స్వప్న గారు, ఐ.క్యూ.ఏ.సీ. కోఆర్డినేటర్ డా. మనోజ్ కుమార్ గారు, అధ్యాపక వర్గం పాల్గొన్నారు.

