23.3 C
Hyderabad
Saturday, August 1, 2026

విపత్తు సమయంలో పాలన యంత్రాంగం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలి

Must read

📰 Generate e-Paper Clip

  • వరద నష్టపరిహారానికి యుద్ధ ప్రాతిపదికన ప్రతిపాదనలు సిద్ధం చేయాలి
  • పోచారం డ్యామ్ మరమ్మత్తు పనులను శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలి
  • కామారెడ్డి లో అధికారులతో సమీక్షలో సీయం రేవంత్ రెడ్డి

 

కామారెడ్డి, బతుకమ్మ : ఇటీవల కురిసిన భారీ వర్షాల వలన పంటలు, రహదారులు, గృహాలు, మౌలిక వసతులు తీవ్రంగా దెబ్బతిన్న నేపథ్యంలో రాష్ట్ర ముఖ్య మంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి కీలక ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత శాఖలు అప్రమత్తంగా ఉండి నష్ట నివారణ చర్యలు వేగవంతంగా చేపట్టారని అభినందించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం సీఎం రేవంత్ రెడ్డి కామారెడ్డి కలెక్టరేట్ లో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.  ఈ సందర్భంగా ముఖ్య మంత్రి మాట్లాడుతూ.. ప్రజలకు చిన్న సమస్య వచ్చినా వెంటనే స్పందించాలన్నారు. విపత్తు సమయంలో పాలన యంత్రాంగం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద సహాయక చర్యల్లో అధికారులు చూపుతున్న చొరవను అభినందించిన సీఎం వరద నష్టపరిహారానికి యుద్ధ ప్రాతిపదికన ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశించారు.

The administration should always be alert during a disaster

నష్టాన్ని శాస్త్రీయంగా అంచనా వేసి పారదర్శక నివేదికలు రూపొందించి కేంద్రానికి పంపాలని సూచించారు. పంటల నష్టం, గృహ నష్టం, రహదారుల దెబ్బతినడం, మౌలిక వసతుల పునరుద్ధరణకు సంబంధించి ఖచ్చితమైన వివరాలు సేకరించాలని జిల్లా కలెక్టర్ కు సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికలు తయారు చేయాలని, విధుల్లో అలసత్వం కనబరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. అలాగే పోచారం డ్యామ్ మరమ్మత్తు పనులను శాశ్వత ప్రాతిపదికన చేపట్టాలని సీఎం ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆహారం, త్రాగునీరు, వైద్య సేవలు, పునరావాసం వంటి మౌలిక అవసరాలు తక్షణమే అందించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమస్యలు వచ్చినప్పుడు మాత్రమే కాకుండా

The administration should always be alert during a disaster

ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండే విధంగా జిల్లా యంత్రాంగం పని చేయాలని సీఎం స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నిబంధనల ప్రకారం వరద సహాయంపై ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేసి నివేదిక సమర్పించాలని సీఎం సూచించారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలు వరదల వలన జరిగిన నష్టాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సీఎం ముందు వివరించారు. ఈ సమావేశంలో మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, గౌరవ సలహాదారు షబ్బీర్ అలీ, జిల్లా ప్రత్యేక అధికారి రాజీవగాంధీ హన్మంతు, ఎస్పీ రాజేష్ చంద్ర, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి రమణారెడ్డి, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

The administration should always be alert during a disaster

More articles

Latest article