బీర్కూర్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా రేషన్ డీలర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు నాగం సురేందర్ , గౌరవ అధ్యక్షులు గౌరిశెట్టి రాజు లను ముందస్తు అరెస్టు చేయడం తగదని బీర్కూరు మండల రేషన్ డీలర్లు ఆరోపించారు. గురువారం బీర్కూర్లో వారు ధర్నా చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు రాజశంకర్ మాట్లాడుతూ.. రేషన్ డీలర్ జిల్లా నాయకులను ముందస్తు అరెస్టు చేయడం తగదన్నారు. తమ సమస్యలను సీఎం రేవంత్ రెడ్డికి విన్నవించేందుకు వెళ్లకుండా తమ రేషన్ డీలర్ నాయకులను అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. రేషన్ డీలర్ ల ఐదు నెలల కమిషన్ వెంటనే చెల్లించాలన్నారు. ఐదు నెలల నుంచి కమిషన్ రాకపోవడంతో గ్రామీణ ప్రాంత రేషన్ డీలర్లు ఆందోళన చెందుతున్నారు అన్నారు. అప్పు చేసి షాప్ రెంటు, కరెంటు బిల్లులు, హమాలీలా ఖర్చులు కట్టుకోవలసి వస్తుందన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం తమ మేనిఫెస్టోలో డీలర్లకు ఇచ్చిన 300 రూపాయల కమిషన్ అలాగే 5000 రూపాయల గౌరవ వేతనం హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో బీర్కూర్ రేషన్ డీలర్ల సంఘం మండల అధ్యక్షులు రాజా శంకర్ , విఠల్, నర్సింలు, సాయిలు, రాజులు, నాగరాజు, నారాయణ, శివకుమార్, పోశెట్టి, శివరాజ్, సుధీర్, బాల్రాజ్, కవిత పాల్గొన్నారు.
