- బీఆర్ఎస్ లో చేరేందుకు ముహూర్తం ఖరారు
- ఈనెల 28న భారీ చేరికలకు ప్లాన్
బతుకమ్మ, కోటగిరి : కాంగ్రెస్ పార్టీ అధికారిలోకి వచ్చిన తరువాత పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరడంతో నియోజకవర్గంలో ఒక్కసారిగా లెక్కలు తారుమారయ్యాయి. కొత్త క్యాడర్, పాత క్యాడర్ మధ్య సఖ్యత లోపించడంతో వర్గ పోరు బహిర్గతమై గ్రూపు రాజకీయాలు బయటపడ్డ విషయం అందరికీ తెలిసిందే. కష్టపడి తమకు కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం దక్కడం లేదంటూ అలిగిన కొందరు కాంగ్రెస్ నేతలు నియోజకవర్గ స్థాయిలో తమ కార్యకర్తలతో కాంగ్రెస్ పార్టీకి టాటా చెప్పి కార్కేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు గుసగుసలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అందుకు అనుగుణంగానే ఒక వర్గానికి చెందిన కాంగ్రెస్ నేతలు నాలుగు రోజుల క్రితం ఓ కార్యక్రమం లో బిఆర్ఎస్ నియోజకవర్గ ఇంచార్జ్ మాజీ ఎమ్మెల్యే బాజీ రెడ్డి గోవర్ధన్ ను కలిసి తమ జాయినింగ్ కు ముహూర్తం ఫిక్స్ చేసుకున్నట్లు సమాచారం. ఈ నెల 28వ తేదీన నియోజకవర్గం వర్గం నుండి సుమారు వేయి మందితో రాజధాని లో బిఆర్ఎస్ నాయకులు కెటీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరేందుకు సంసిద్ధం అవుతున్నారనే వార్త నియోజకవర్గ స్థాయిలో చెక్కర్లు కొడుతుంది. ప్రతిపక్షమే లేకుండా పరిపాలన చేస్తున్న స్థానిక ఎంఏల్ఎ పోచారం శ్రీనివాస్ రెడ్డికి స్వంత పార్టీ నేతలే నేడు పక్క పార్టీలో చేరి ప్రతిపక్ష పాత్ర పోషించేందుకు సిద్ధంగా ఉండడంతో రానున్న స్థానిక ఎన్నికలలో బాన్సువాడ నియోజకవర్గం రాజకీయం రసవత్తరంగా మారే అవకాశం ఉంది. ఒక్కసారిగా భారీ మొత్తంలో నాయకులు కార్యకర్తలు పార్టీ వీడితే కాంగ్రెస్ హై కమాండ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాల్సిందే.
