నిజామాబాద్ క్రైం, బతుకమ్మ : గుడి పూజారిని హత్య చేసిన దుబ్బాక లక్ష్మణ్ కు జీవిత కారగారా శిక్ష విదిస్తూ నిజామాబాద్ రెండవ సెషన్స్ జడ్జి టి. శ్రీనివాస్ మంగళవారం తీర్పు వెలువరించారు. నిజామాబాద్ మండలం సారంగపూర్ గ్రామానికి చెందిన దుబ్బాక లక్ష్మణ్, ఆర్మూర్ పట్టణంలోని పెర్కిట్ గ్రామ నివాసుడైన నర్రా ఎల్లయ్య స్నేహితులు. వీరు పలు దొంగతనాలు చేసి జైలు జీవితం గడిపారు. ఇద్దరికి జైలులోనే పరిచయం కలిగి స్నేహంగా మారింది. జైలు నుండి బెయిలు పై విడులైన అనంతరం తీరు మార్చుకోకుండా ఎప్పటిలాగే దొంగతనాలు, మర్డర్లకు అలవాటు పడ్డారు. 30 ఏప్రిల్, 2017 న లక్ష్మణ్ ఆటోలో ఇద్దరు కలిసి దొంగతనాలు చేయడానికి బయలుదేరారు. అర్థరాత్రి చిన్నపూర్ అటవీ ప్రాంతానికి చేరుకున్న వీరు అక్కడ నిర్మాణంలో ఉన్న శ్రీరామ దేవాలయం దగ్గర గుడి పూజారి మేర నారాయణ గిరి స్వామి తన గుడిసెలో నిద్రపోతున్న సమయంలో లక్ష్మణ్ పెద్ద బండరాయితో అతని తలపై బలంగా వేశాడు. ఎల్లయ్య కట్టేతో కొట్టి తీవ్రంగా గాయపరచాడు. ఇద్దరి నేర చర్యలకు రక్తాల గాయల పాలైన పూజారి మృతి చెందాడనే నేరారోపణలు కోర్టు నేర న్యాయ విచారణలో నిరూపితం అయినట్లు నిర్ధారిస్తూ ప్రధాన ముద్దాయి లక్ష్మణ్ కు హత్య కేసులో జీవితఖైదు, పూజారి డబ్బులు, సెల్ ఫోన్ దొంగలించినందుకు గాను మూడు సంవత్సరాల కఠిన జైలుశిక్ష విధించారు. కేసు కోర్టు విచారణ లో ఉండగా రెండవ ముద్దాయి ఎల్లయ్య మరణించినందున కేసును తొలగించారు.
