- జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
ఎల్లారెడ్డిపేట, బతుకమ్మ : రేషన్ కార్డు అనేది ప్రతి పేదవారికి ఆత్మ గౌరవానికి ప్రతీక అని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. ఎల్లారెడ్దిపేట మండల కేంద్రం లోని సాయిమణికంఠ గార్డెన్స్ లో నూతన రేషన్ కార్డుల పంపిణి కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎల్లారెడ్దిపేట మండలంలోని అర్హులైన లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు జారీ చేస్తున్నామని ఈ కార్యక్రమం నిరంతర ప్రక్రియ వెల్లడించారు.వీటి ద్వారా పేదలకు ప్రతి నెల రేషన్ అందుతుందన్నారు. మండలంలో నూతనంగా 1494 కొత్త కార్డులు, ఇప్పటికే ఉన్న కార్డుల్లో 2999 మంది కుటుంబ సభ్యుల పేర్లను అదనంగా నమోదు చేసి అందిస్తున్నామని అన్నారు. ఇప్పటి వరకు మొత్తం 20838 రేషన్ కార్డులు ఉన్నాయని వెల్లడించారు. ప్రజల జీవనంలో రేషన్ కార్డు చాలా ముఖ్యమైన, కీలక డాక్యుమెంట్ అని తెలిపారు.ఆధార్ కార్డు, కరెంట్ కనెక్షన్ , ప్రభుత్వ పథకాల అమలు వంటి అనేక కార్యక్రమాలకు రేషన్ కార్డు ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు.ప్రతి లబ్ధిదారుడికి నెలకు 6 కిలోల సన్న బియ్యం రేషన్ దుకాణాల ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందని వివరించారు. నూతన రేషన్ కార్డు ద్వారా ఇందిరమ్మ ఇండ్లు, ఫించన్ వంటి అనేక సంక్షేమ పథకాలకు అర్హత వస్తుందని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా స్పష్టం చేశారు. ప్రతి లబ్ధి దారుడు రేషన్ కార్డులను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో సిరిసిల్ల ఆర్డిఓ వెంకటేశ్వర్లు, జిల్లా పౌర సరఫరాల అధికారిని శ్రీలత, బొప్పాపూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ సబేరా బేగం, వైస్ చైర్మెన్ గుండా డి రాంరెడ్డి , బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సద్ది లక్ష్మారెడ్డి, వీర్నపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భూత శ్రీనివాస్ గౌడ్,ఎల్లారెడ్డిపేట మండల డిప్యూటీ తహసిల్దార్ మురళీ కృష్ణ, ఆర్ ఐ శ్రవణ్, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు, సంబంధిత రెవెన్యూ అధికారులు, రేషన్ డీలర్లు, రేషన్ కార్డుల లబ్ధిదారులు,పలు గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

