- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత
హైదరాబాద్, బతుకమ్మ : కోర్టు ఆదేశాలను గౌరవించి దీక్షను ఇంతటితో ముగిస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. హైదరాబాద్ లోని ధర్నా చౌక్ వద్ద నిర్వహించిన దీక్ష కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడారు. ‘‘హైకోర్టు పర్మిషన్ ఇవ్వాలా వద్దా అని పోలీసులను అడిగితే పోలీసులు 8వ తేదీ నుంచి దీక్ష చేసుకోమన్నారు. జాగృతి క్రమశిక్షణ గల సంస్థ.. కోర్టు ఆదేశలను ధిక్కరించదు.. కోర్టుల పట్ల నాకు గౌరవం ఉంది. ప్రభుత్వం తప్పులను ఎత్తిచూపుతూ బీసీల తరపున పోరాటం చేస్తున్నాం. సింహం ఒక అడుగు వెనక్కి వేస్తే వెనక్కి తగ్గినట్టు కాదు. మేము ఒక అడుగు వెనక్కి వేస్తే పది అడుగులు ముందుకు వేస్తామన్నది గుర్తు పెట్టుకోవాలి. బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం ఆగదు అనేక రూపాల్లో చేస్తాము. ఢిల్లీ కాంగ్రెస్ ధర్నాలు టైం పాస్ ధర్నాలు.. వాటితో సాధించేది ఏమీ లేదు. మీరు రాష్ట్రపతి వద్దకు వెళ్ళండి. గవర్నర్ పై సుప్రీంకోర్టులో కేసు వేయండి. ఢిల్లీలో టైమ్ పాస్ ధర్నాలు చేస్తే తెలంగాణ బీసీ బిడ్డలు ఊరుకోరు. మళ్లీ సమాలోచనలు చేసి మరో రూపంలో పోరాటం

చేస్తాము. లోకల్ బాడీల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్తే ఎన్నికలు ఎట్లా ఆపాలో మాకు తెలుసు. లోకల్ బాడీల్లో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కచ్చితంగా వస్తాయనే నమ్మకం ఉంది. కాళేశ్వరం నివేదికపై స్పందించిన కవిత. పీసీ ఘోష్ కమీషన్ నివేదికలో కేసీఆర్ పేరును 35 సార్లు ప్రస్తావించినంత మాత్రాన ఆయన తప్పు చేసినట్టు కాదు. కమీషన్ నివేదికతో కేసీఆర్ కు ఏం కాదు. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా కమీషన్ నివేదికను బయట పెట్టారు. నిపుణుల కమిటీ సూచనల మేరకు నిర్మాణాలు జరిగాయి. కమీషన్ మెగా క్రిష్ణారెడ్డిని ఎందుకు విచారించలేదు. కాళేశ్వరం కమిషన్ నివేదికతో కొందరి అరెస్టులు ఉంటాయని మీడియాలో వస్తోన్న వార్తలు కావాలని కల్పించినవే. కేసీఆర్ పేరుతో ప్రచారం చేస్తున్న అంశాలను మేము పట్టించుకోము.. కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడితే చూద్దాం’’ అని అన్నారు.

