- ఆర్టిఏ చెక్ పోస్టులో ఏసీబీ ఆకస్మీక తనిఖీలు
- తనిఖీలు జరుగుతుండగానే కొనసాగిన వసూళ్ల పర్వం
- పొందుర్తి చెక్ పోస్టులో రూ.52 వేలు స్వాధీనం
- చర్యల కోసం ప్రభుత్వానికి సిఫారసు
బిక్కనూర్, బతుకమ్మ : కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం పొందూర్తిలో గల రవాణా శాఖ తనిఖీ కేంద్రంలో బుధవారం ఏసీబీ అధికారులు ఆకస్మీక తనిఖీలు నిర్వహించారు. నిజామాబాద్ ఏసీబీ డీఎస్పీ శేఖర్ గౌడ్, ఇన్స్ పెక్టర్ లు నగేశ్, శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి ఉదయం 9 గంటల ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు. అప్పటికే విధులలో ఉన్న ఎఏంవిఐ సాం రిచర్డ్ సన్ తో పాటు ఐదుగురు ఏజెంట్లు చెక్ పోస్టు మీదుగా వెలుతున్న వాహనాల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు గుర్తించారు. ఏసీబీ ఆకస్మీక తనిఖీలలో ఎఏంవిఐ సాం రిచర్డ్ సన్ వద్ద రూ.16,000, ప్రైవేట్ ఏజెంట్ జి.శివ కుమార్ వద్ద రూ.9,000, ఆఫిస్ పైల్ పోల్డర్ లో రూ.4,000 స్వాధీనం చేసుకున్నారు. అవినితీ నిరోధక శాఖాధికారులు చెక్ పోస్టు వద్ద రవాణా శాఖ సిబ్బంది మాదిరిగా విధులు

నిర్వహించగా దాదాపు రూ.23,000 కలెక్షన్ వచ్చింది. మొత్తంగా రవాణా శాఖ చెక్ పోస్టులో మధ్యాహ్నం వరకు రూ.52 వేల అనాధికార నగదును గుర్తించి సీజ్ చేశారు. రవాణా శాఖాధికారులు ఏళ్ల తరబడి చెక్ పోస్టులలో విధుల నిర్వహణ పేరిట అతుక్కుపోయి ప్రైవేట్ ఏజెంట్ల వద్ద వసూళ్ల పర్వం చేపడుతున్నట్లు గుర్తించారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తు, ప్రైవేట్ ఏజెంట్లను నియమించుకుని డ్రైవర్లు, వాహనాల యజమానుల నుంచి నిత్యం వసూళ్లు చేస్తున్నట్లు గుర్తించారు. సంబంధిత తనిఖీల రిపోర్టును ప్రభుత్వానికి పంపించి అవినీతి అధికారులపై చర్యలకు సిఫారసు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఉదయం ప్రారంభమైన తనిఖీలు సాయంత్రం వరకు కొనసాగాయి. ఏసీబీ తనిఖీల విషయం తెలియని వాహనాల డ్రైవర్లు, యజమానులు చెక్ పోస్టుకు ఇరువైపుల వాహనాలను నిలిపి డబ్బులు ఇచ్చి వెళ్లడం చూసి అధికారులే షాక్ కు గురయ్యారు. ఆర్గనైజ్డ్ వ్యవస్థను ఏర్పాటు చేసుకుని వసూళ్లను చేస్తున్నట్లు గుర్తించారు ఏసీబీ అధికారులు.

