నిజామాబాద్ నగరంలో ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో కార్మికులతో భారీ ర్యాలీ
నిజామాబాద్, బతుకమ్మ : సార్వత్రిక సమ్మె పిలుపులో భాగంగా నగరంలో భారత కార్మిక సంఘాల సమైక్య(ఐఎఫ్టీయూ) ఆధ్వర్యంలో భారీ ర్యాలీని శివాజీ చౌక్ నుండి రాజీవ్ గాంధీ ఆడిటోరియం వరకు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ జిల్లా సహాయ కార్యదర్శి శివకుమార్, జిల్లా ఉపాధ్యక్షులు మల్లికార్జున్ లు మాట్లాడుతూ దేశంలో కార్మికులు పోరాడి సాధించుకున్న 29 కార్మిక చట్టాల హక్కులను కేంద్ర ప్రభుత్వం కాలరాస్తుందన్నారు. నాలుగు లేబర్ కోడ్ లను తీసుకొచ్చి 50 కోట్ల మంది కార్మిక వర్గానికి అన్యాయం చేస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానాలను మానుకోవాలని, నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెంబర్ 282 ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ నాయకులు మోహన్,రాజు,ఎల్లప్ప, దాసు,ఇమ్రాన్,రైస్, వకీలు భాయ్,గంగాధర్, సాయిలు, తదితరులు పాల్గొన్నారు.
