నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పెండింగ్ లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ నిధులు 7500 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని రాష్ట్రవ్యాప్త డిగ్రీ ,పీజీ, ఇంజనీరింగ్ కళాశాలల మూడు రోజుల బంద్ పిలుపులో భాగంగా మొదటి రోజు నిజామాబాద్ నగరంలో గిరిరాజ్ కాలేజ్, నిశిత, నలంద, ఎస్ఎస్ఆర్, గౌతమి, కేర్, కళాశాలలు బంద్ చేయటం జరిగింది. మరి కొన్ని కళాశాలలు స్వచ్చందంగా బంద్ చేశారు. ఈ సందర్భంగా పి డి ఎస్ యూ జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాలుగా ఫీజు రియంబర్స్మెంట్ నిధులు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడం వలన పేద విద్యార్థుల సర్టిఫికెట్స్ కళాశాలలలో ఉంటున్నాయని, ఉన్నత చదువులకు పేద విద్యార్థులు దూరం అవుతున్నారని తెలిపారు. ఫీజు రియంబర్స్మెంట్ పథకన్నీ ప్రారంభించిన కాంగ్రెస్ ప్రభుత్వమే నేడు రీయంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే ఆలోచనలో ఉందని, ఇంజనీరింగ్ కళాశాలల బి కేటగిరి సీట్లను కన్వీనర్ కోటాలో భర్తీ చేయాలని డోనేషన్స్ తీసుకునే కళాశాలపై చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పి డి ఎస్ యూ జిల్లా సహాయ కార్యదర్శి ప్రిన్స్, జిల్లా నాయకులు మనోజ్,హుస్సేన్, నగర నాయకులు సాయికిరణ్, దుర్గాప్రసాద్, కృష్ణ ,రాజు, తదితరులు పాల్గొన్నారు.

