- టీజీఎస్ సీపీసీఆర్ సభ్యురాలు హేమలత అగర్వాల్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : తల్లిదండ్రులు లేరని ఆందోళన చెందకుండా పిల్లలు బాగా చదువుకొని ఉన్నత స్థాయిలో ఎదగాలని టీజీఎస్ సీపీసీఆర్ సభ్యురాలు హేమలత అగర్వాల్ అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గల బాలసదనం, శిశు గృహ, సారంగాపూర్ జిల్లా పరిషత్ హై స్కూల్ లను బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా బాలసదనం శిశు గృహాలలో సౌకర్యాలు, సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. శిశు గృహాన్ని సందర్శించి, పిల్లలకు అందిస్తున్న సౌకర్యాలు, ప్రభుత్వం నుండి వారికి అవసరమైన, పొందవలసిన సౌకర్యాల గురించి తెలియజేయాలని సూచనలు చేయలని కోరారు. సారంగాపూర్లోని ఎంపీపీఎస్, జడ్పీహెచ్ఎస్ పాఠశాలలను సందర్శించి, పిల్లలకు పలు సూచనలు చేశారు. అమ్మాయిలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. తరగతి గదుల్లో సౌకర్యాల కొరత, పాత భవనాలు, మరుగుదొడ్ల కొరత, సరైన సౌకర్యాల కొరతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి షేక్ రసూల్ బీ, జిల్లా బాలల రక్షణ అధికారి చైతన్య కుమార్, మండల విద్యాధికారి, స్కూల్ హెడ్ మాస్టర్ , శిశు గృహ మేనేజర్, బాలసదనం సూపరింటెండెంట్ వినోద, స్వర్ణలత, చైల్డ్ హెల్ప్లైన్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

