- సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : పహల్గాంలో పర్యాటకుల హత్యలు , ఆపరేషన్ సింధూర్ లో దాగి ఉన్న నిజాలపై సమగ్ర విచారణ జరిపి, భారత ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య డిమాండ్ చేశారు. సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కోటగల్లి నీలం రామచంద్రయ్య భవన్లో శనివారం జిల్లా సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఆకుల పాపయ్య మాట్లాడుతూ గత నెలలో కాశ్మీర్ లోయలో ఉగ్ర దాడి జరిగిందని , దాడి చేసిన వారిని ఇప్పటికి వరకు కేంద్ర ప్రభుత్వం గుర్తించి పట్టుకోలేదని , ఆపరేషన్ సింధూర్ లో యుద్ధం అర్ధాంతరంగా ముగింపును అమెరికా అధ్యక్షుడు ట్రంపు ప్రకటించడంలో అంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. అమెరికా సామ్రాజ్యవాద అధినేతకు అధికారం ఎవరిచ్చారని ఆయన నిలదీశారు. ప్రపంచంలో అతి పెద్ద దేశమైన మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ భారత పార్లమెంటులో కానీ, దేశములోని విపక్ష రాజకీయ పార్టీల సమావేశం ఏర్పాటు చేసి కానీ, చర్చించకుండా నేరుగా యుద్ధ విరమణ ప్రకటన ట్రంపు చేయడం, నరేంద్ర మోడీ మౌనవ్రతం పాటించడం పరిశీలిస్తే, నరేంద్ర మోడీ ప్రభుత్వం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కు లొంగిపోయి మోకరిల్లినట్లుగా ఉందని ఆయన తెలిపారు. ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత ప్రజల దేశభక్తికి పరీక్ష పెట్టిన, నరేంద్ర మోడీ సర్కార్ అనుసరిస్తున్న విధానంపై అనేక అనుమానాలు ఏర్పడుతున్నాయని ఆయన అన్నారు. పాకిస్తాన్ సరిహద్దుకు 180 కిలోమీటర్ల దూరంలో ఉన్న పహల్గాం యాత్రికులపై టెర్రరిస్టులు అతికిరాతంగా దాడి చేసి హత్య చేసి, మాయం కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని ఆయన అన్నారు. పటిష్టమైన నిఘా విభాగం, సైన్యం కలిగి యున్న ఎందుకు ఇలా జరుగుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ నాయకులు పరుచూరి శ్రీధర్, బి.భూమన్నా ,నీలం సాయిబాబా, సూర్య శివాజీ, గౌతం కుమార్, శివకుమార్,సత్యం,మార్క్స్, బాలయ్య,మల్లికార్జున్, సాయినాథ్,లక్ష్మి,సంజన, గోపాల్, సంజీవ్, ఏళ్ళన్న,మోహన్,నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.
