- ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం కుల గణన నిర్వహించి దేశానికే ఆదర్శంగా నిలిచిందని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ అన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజక వర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం పట్టణ అధ్యక్షులు కేశవేణు అధ్యక్షతన బుధవారం బస్వా గార్డెన్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిలుగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్, పట్టణ ఇన్చార్జీ ఎంఎల్సీ వెంకట్ బల్మూరి, మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్, రాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్.మనాల మోహన్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మాట్లాడుతూ.. ప్రజలు మనల్ని నాయకులుగా ఉన్నందుకు ప్రజల సమస్యలు తీర్చడానికే ఎక్కువ సమయం ఇవ్వాలని, అప్పుడే ప్రజా నాయకులం అవుతాం తప్ప పదవుల కోసం పాకులాడితే కుదరదని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో 83 కోట్లతో అభివృద్ధి చేస్తున్నామని, కొత్తగా రెండు లిఫ్టులు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఆస్పత్రి డ్రైన్ మొత్తం కొత్తగా మారుస్తున్నామన్నారు. బిఆర్ఎస్, బీజేపీ చేసిందేమీ లేదని, ఇవన్నీ మనం ప్రజలకు చెప్పాలని సూచించారు. చిన్న చిన్న గొడవలు పక్కన పెట్టీ రాబోయే ఎన్నికల్లో ముందుకు వెళ్ళాలన్నారు. ప్రజలకు సేవ చేసే విధంగా కాంగ్రెస్ నాయకులు లక్ష్యం పెట్టుకోవాలని పేర్కొన్నారు. యంత్రాంగం లో జరిగే తప్పులను సరిచేస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. చిన్న చిన్న గొడవలకు వివాదాలు చేస్తే పార్టీ నుండి సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. కార్యకర్తలు ఐక్యంగా ఉంటే అందరికీ పదవులు ఇచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఇన్ని రోజులు కార్యకర్తలు మన గెలుపు కోసం కష్టపడ్డారని, ఇప్పుడు వారి రుణం తీర్చుకోవడానికి సమయం ఆసన్నమైందని, వారికోసం పనిచేసి వారిని గెలిపించి నాయకులుగా తీర్చిదిద్దుతామని అన్నారు. అందరూ పార్టీ సమావేశాలు తప్పకుండా రావాలని కోరారు. ఏఐసీసీ ఆదేశాలు మేరకు డివిజన్ పట్టణ కమిటీలు ఏర్పాటుకు అందరూ సహకరించాలన్నారు. కార్యకర్తలకు బాధ్యతలు,పదవులు ఇవ్వడమే మా లక్ష్యమని అన్నారు. భూ భారతీ ద్వారా రైతుల సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. కేసీఆర్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పేరుతో కమిషన్లు తిన్నారని విమర్శించారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నియోజకవర్గానికి 3500 ఇళ్లు ఇస్తుందన్నారు. ఒక్కొక నియోజకవర్గానికి 10000 ఇల్లు ఇవ్వడానికి ప్రణాళిక సిద్ధంగా ఉందని అన్నారు. మన వాళ్ళు వేరే వాళ్ళు అనే తేడా లేకుండా ప్రతి పేదవాడికి ఇల్లు అందిస్తామని, ఇల్లు నిర్మాణ పనులను బట్టి నిధులు మంజూరు అవుతాయని అన్నారు. జై బాపు జై భీం జై సంవిధాన్ అభియాన్ కార్యక్రమం ప్రతి డివిజన్ కు తీసుకు వెళ్తున్నారని ఈ కార్యక్రమాన్ని ఇంకా గట్టిగా ప్రజల్లోకి తీసుకుపోవాలని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ బలంగా నిలబడాలంటే ముందుగా మన ప్రభుత్వం అధికారంలో ఉండాలని, మనలో మనం కలిసి ఉండాలని సూచించారు. పాత కొత్త అనే తేడా ఉండకూడదని, పార్టీని బలోపేతం చేయాల్సిన బాధ్యత మనపైన ఉందని అన్నారు. ఎవరైతే కింది స్థాయిలో పార్టీ జెండా మోసి బలోపేతానికి పనిచేశారో వారిని గుర్తించి వారికి పదవులు ఇస్తామని తెలిపారు. క్రమశిక్షణ కలిగిన వారికే పార్టీ పదవులు వస్తాయన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ పట్టణ అనుబంధ సంఘాల ప్రెసిడెంట్లు, పార్టీ డివిజన్ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

