కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు
నిజామాబాద్, బతుకమ్మ : ప్రభుత్వం నిర్వహిస్తున్న భూభారతి రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. భూ భారతి పైలట్ ప్రాజెక్ట్ రెవెన్యూ సదస్సులలో భాగంగా సోమవారం మెండోరా మండలం చాకిర్యాల్, కొడిచెర్ల గ్రామాలలో నిర్వహించిన సదస్సులలో కలెక్టర్ పాల్గొన్నారు. రైతులతో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. భూ భారతి చట్టంపై అవగాహన కల్పించి, రైతుల సందేహాలను నివృత్తి చేశారు. మెండోరా మండలాన్ని పైలెట్ ప్రాతిపదికన ఎంపిక చేసి గ్రామాల వారీగా రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామన్నారు. ఈ రెవెన్యూ సదస్సుల్లో భూ రికార్డులలో పేరు తప్పులు,విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నెంబర్ మిస్సింగ్, పట్టా పాస్ బుక్కులు లేకపోవడం, ప్రభుత్వ భూములను నవీకరించడం, సాదాబైనామా కేసులు, హద్దుల నిర్ధారణ, పార్ట్-బి లో చేర్చిన భూముల సమస్యలు, భూసేకరణ కేసులు తదితర భూ సమస్యలకు సంబంధించిన దరఖాస్తులు స్వీకరించి భూభారతి చట్టం ప్రకారం అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి, నిర్దేశిత గడువు లోపు పరిష్కరిస్తారని తెలిపారు. ఈ సందర్భంగా రైతు గుర్తింపు కార్డుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ, హెల్ప్ డెస్క్, జనరల్ డెస్క్ ల వద్ద సదుపాయాలు, సిబ్బంది పనితీరును కలెక్టర్ పరిశీలన జరిపి, అధికారులకు పలు సూచనలు చేశారు. అర్జీలు సమర్పించేందుకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. భూ సంబంధిత సమస్యలు ఉన్న వారు నిర్ణీత ప్రొఫార్మా లో సరైన విధంగా దరఖాస్తు చేసుకునేలా సహకారం అందించాలని హెల్ప్ డెస్క్ సిబ్బందిని ఆదేశించారు. దరఖాస్తులను వెంటవెంటనే పరిశీలిస్తూ, సత్వర పరిష్కారానికి అనువుగా ఉన్న వాటిని తహసీల్దార్ దృష్టికి తెచ్చి పరిష్కారం జరిగేలా చూడాలన్నారు. ఈ సదస్సులలో ఆర్మూర్ ఆర్డీఓ రాజాగౌడ్, తహశీల్దార్ సంతోష్ రెడ్డి, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

