నిజామాబాద్ క్రైం, బతుకమ్మ :
నిజామాబాద్ నగరంలోని మాలపల్లిలోని తన నివాసం నుంచి ఈ నెల 22న ఇంటి నుంచి వెళ్లి మిస్సింగ్ అయిన యువకుడు జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం జరిగింది. నగరంలోని మాలపల్లికి చెందిన తాహిర్ (26) ఐచర్ వాహనంలో లోడ్ కోసం వెళ్లి పది నిమిషాల్లో ఇంటికి వస్తానని తిరిగి రాలేదు. వాహనాన్ని మాత్రం ఫ్రూట్ మార్కెట్ ఏరియాలో పార్కింగ్ చేసి వెళ్లిన తాహిర్ ఫోన్ స్వీచ్చాఫ్ కావడంతో కుటుంబ సభ్యులు 1వ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అయితే ఈ నెల 22న నగరంలోని పూలాంగ్ ప్రాంతంలో అపస్మారక స్థితిలో ఉన్న తాహిర్ ను అంబులెన్స్ సిబ్బంది జిల్లా జనరల్ ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ తాహిర్ బుధవారం మరణించాడు. పోలీసులు విచారణలో భాగంగా తాహిర్ మిస్సింగ్ ఫోటోల ఆధారంగా ఆసుపత్రిలో మరణించింది అతడేనని నిర్ధారించారు. 22న మిస్సింగ్ అయిన యువకుడిపై దాడి జరిగిందని అమ్మాయి విషయంలోనే ఘటన జరిగి ఉంటుందని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.

