- అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : హిందూ హృదయ సామ్రాట్ ఛత్రపతి శివాజీ మహారాజ్ హిందూ ధర్మ రక్షణ కోసం మొఘలులను ఎదిరించి, హిందూ స్వరాజ్య స్థాపనకు తన ప్రాణాలను అర్పించిన యోధుడని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నగరంలో బుధవారం ఘనంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ 395వ జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా బోర్గం ప్రాంతంలో కొత్తగా ఏర్పాటు చేసిన శివాజీ మహారాజ్ విగ్రహాన్ని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ ఆవిష్కరించి, ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం గాజుల్ పేట్, నాందేవాడ శివాజీ చౌక్ వద్ద నిర్వహించిన అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించి, శివాజీ మహారాజ్ విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. శివాజీ మహారాజ్ వీరత్వానికి తల్లి జిజియా బాయ్ గొప్ప స్ఫూర్తి, చిన్నతనం నుంచే ఆయనను శత్రువులను ఎదిరించేలా తీర్చిదిద్దారని కొనియాడారు. మొఘలుల కాలంలో హిందువులను బానిసలుగా చేసి, మత మార్పిడులు బలవంతంగా జరిగించిన రోజుల్లో శివాజీ మహారాజ్ 17వ ఏటనే కత్తి చేతపట్టి జై భవాని అంటూ మొఘలులపై తిరుగుబాటు చేశారని తెలిపారు.

నేటి యువత మొఘల్ చరిత్ర కంటే, ఛత్రపతి శివాజీ, వీరసావర్కర్, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లాంటి మహానుభావుల చరిత్ర తెలుసుకోవాలని సూచించారు. హిందూ యువత మేల్కొని హిందూ ధర్మాన్ని పరిరక్షించాల్సిన సమయం ఆసన్నమైందని పిలుపునిచ్చారు. 2048 నాటికీ హిందూ దేశంగా మార్చడానికి ప్రతి హిందూ యువకుడు ప్రతిజ్ఞ చేయాలని, ఛత్రపతి శివాజీ మహారాజ్ మార్గంలో నడవాలని కోరారు. లవ్ జిహాద్ హిందూ మతాన్ని టార్గెట్ చేసే కుట్రలను గుర్తించి, ప్రతి హిందువు తన ధర్మాన్ని పరిరక్షించాలన్నారు. స్వామి వివేకానంద చెప్పినట్టు “ఉక్కు నరాలు, ఇనుప ఖండరాలు, వజ్ర సంకల్పం” కలిగిన యువతనే భవిష్యత్తు భారతదేశాన్ని నిర్మించగలరని తెలిపారు. ఈ కార్యక్రమంలో శివాజీ ఉత్సవ సమితి సభ్యులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

