- రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ
నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2025-2026 కేవలం సంపన్న వర్గానికి ప్రయోజనకరంగా ఉందని దీనిని సవరించాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పశ్య పద్మ డిమాండ్ చేశారు. స్థానిక అంబేద్కర్ కాలనీలో గల హమాలీ యూనియన్ ఏఐటియుసి కార్యాలయంలో గురువారం సిపిఐ జిల్లా కౌన్సిల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు పశ్య పద్మ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ 2025-2026 కేవలం సంపన్న వర్గానికి ప్రయోజనకరంగా ఉందని రైతులకు, కార్మికులకు, నిరుపేద ప్రజలకు వ్యతిరేకంగా ఉందని అన్నారు. రైతులు సుదీర్ఘకాలంగా చేస్తున్న డిమాండ్స్ పంటలకు మద్దతు ధరల గ్యారెంటీ చట్టం చేసి అమలుకు నిధులు కేటాయించకపోవడం, రుణమాఫీ చట్టం చేసి ఎలాంటి ప్రస్తావన ఈ బడ్జెట్ లో చేయకపోవడం దుర్మార్గమని అన్నారు. ఆదాయ పన్ను 12 లక్షల వరకు మినహాయింపు ఇవ్వడం కేవలం 80 నుంచి 85 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది కానీ రెండు కోట్ల 50 లక్షల మంది ధనికులకు, కార్పొరేట్ కంపెనీల యజమానులకు ఉపయోగపడే విధంగా ఉంది రెండు కోట్ల 27 లక్షల 315 మంది కోటి రూపాయల ఆదాయం ఉన్నవారు, 265 మంది 100 కోట్లు ఆదాయం ఉన్నవారు,25 మంది 500 కోట్ల రూపాయల ఆదాయం వచ్చే వారికి లాభం లాభం చేకూర్చే విధంగా ఈ బడ్జెట్ ఉందని అన్నారు. నిరుద్యోగ సమస్య పరిష్కరించి అధిక ధరల తగ్గింపుకు గ్రామీణ ఉపాధి హామీ పథకం పూర్తిస్థాయిలో అమలు చేయడానికి బిసి,ఎస్సీ, ఎస్టీ ప్రజల అభివృద్ధి తగ్గట్టుగా ఈ బడ్జెట్లో కేటాయింపులు లేవని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి పి.సుధాకర్, సిపిఐ రాష్ట్ర నాయకులు కంజర భూమయ్య, సిపిఐ కామారెడ్డి జిల్లా కార్యదర్శి ఎల్.దశరథ్, సిపిఐ జిల్లా నాయకులు వై.ఓమయ్య, అడ్డికే రాజేశ్వర్, వై రాజిరెడ్డి, పి.ముత్యాలు రఘురాం,అంజలి తదితరులు పాల్గొన్నారు.
