- అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ
నిజామాబాద్ సిటి, బతుకమ్మ : ఇటీవల ఢిల్లీలో జరిగిన శాసనసభ ఎన్నికల్లో బీజేపీ 27 ఏళ్ళ తర్వాత అధికారం దక్కించుకుందని అదే స్పూర్తితో స్థానిక సంస్థల్లో కాషాయ జండాను ఎగురవేసే వరకు పార్టీ కార్యకర్తలు పాటుపడాలని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. గ్రాడ్యుయేట్,టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల వర్క్ షాప్ సోమవారం భారతీయ జనతా పార్టీ అర్బన్ శాఖ ఆధ్వర్యంలో జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్,ఆదిలాబాద్,నిజామాబాదు,మెదక్ పట్టభద్రుల,టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికలు కార్యకర్తలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలన్నారు. ఢిల్లీలో ఎగిరిన కాషాయ జెండా గల్లీలో ఎగిరేవరకు ప్రతి కార్యకర్త శక్తి వంచన లేకుండా పని చేయాలని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం,ప్రస్తుత ప్రభుత్వం నిరుద్యోగులను నిండా ముంచాయన్నారు గత ప్రభుత్వం లక్ష ఉద్యోగాలు ఇస్తాం అంటే కాంగ్రెస్ రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఒక్క నోటిఫికేషన్ కొత్తగా వేసిన దాఖలాలు లేవన్నారు. గత ప్రభుత్వం 3 వేల నిరుద్యోగ భృతి అంటే కాంగ్రెస్ 4 వేలు ఇస్తామని నిరుద్యోగులను మోసం చేశాయన్నారు.హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ లో ఏ ఒక్క హామీ నెరవేర్చడంలో కాంగ్రెస్ విఫలం అయిందన్నారు. ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పై ప్రశ్నిస్తే కాంగ్రెస్ కేసులు పెడుతుందని మండిపడ్డారు.317 జీవో,ప్రమోషన్,రిటైర్మెంట్ బెనిఫిట్స్ విషయంలో ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదన్నారు. ప్రశ్నించే గొంతుకలైన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి అంజి రెడ్డిని,టీచర్ ఎమ్మెల్సి అభ్యర్థి మల్కా కొమురయ్యను భారీ మెజారిటీతో గెలిపించే దిశగా కార్యకర్తలు పని చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి,బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు నాగోళ్ళ లక్ష్మి నారాయణ,ఇందూరు బిజెపి ఎమ్మెల్సీ ఎన్నికల ఇన్చార్జ్ కొండా ఆశన్న, అసెంబ్లీ కో కన్వీనర్ నారాయణ యాదవ్, మండల అధ్యక్షులు,నాయకులు పాల్గొన్నారు.
