నిజామాబాద్ సిటీ, బతుకమ్మ : జిల్లాలోని అన్ని స్కానింగ్ కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించాలని గర్భస్త పిండ లింగ నిర్ధారణ పరీక్ష చట్టం జిల్లా సలహా కమిటీ సూచించింది. గర్భస్త పిండ లింగ నిర్ధారణ పరీక్ష చట్టం జిల్లా సలహా కమిటీ సమావేశం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ చట్టం జిల్లాలో పకడ్బందీగా నిర్వహించడానికి చేపట్టాల్సిన చర్యల గురించి ఈ సమావేశంలో చర్చించారు. జిల్లా లోని అన్నీ స్కానింగ్ కేంద్రాలను ప్రోగ్రాం అధికారి ఆకస్మిక తనిఖీలు చేస్తూ నివేదికలు అందించాలని కమిటీ సభ్య్లులు సూచించారు. మండల స్థాయిలో వైద్యాధికారులు, పర్య వేక్షక సిబ్బంది ఆశాలు, ఆరోగ్య కార్యకర్తలు లింగ వివక్ష పట్ల క్షేత్ర స్థాయి అవగాహనా కార్యక్రమాలు నిర్వహిచాలని తెలిపారు. లింగ నిర్ధారణ చేస్తున్న స్కానింగ్ కేంద్రాలను గుర్తించి చట్ట పరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రతి స్కానింగ్ కేంద్రం జిల్లా అథారిటీ లో రిజిష్ట్రేషన్ చేసుకునే విధంగా కఠిన నిబంధనలు అమలు చేయాలని సలహా కమిటీ లో తీర్మానాలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ చంద్రశేఖర్, న్యాయ నిపుణులు ఎం.సంతోష్ కుమార్ , న్యాయవాది, జిల్లా సమాచార, పౌర సంబందాల శాఖ అధికారి ఎన్.భీమ్ కుమార్, ప్రోగ్రాం అధికారి డా.అనురాధ, సఖి కోఆర్డినేటర్ భారతి, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి వైద్యులు డాక్టర్ శిరీష, డాక్టర్ రేఖ, మాస్ మీడియా అధికారి వేణు గోపాల్ తదితరులు పాల్గొన్నారు.

